Elections: తెలంగాణలో వేడెక్కుతున్న రాజకీయాలు

Elections: తెలంగాణలో వేడెక్కుతున్న రాజకీయాలు
X
అసెంబ్లీ సమరం ముందు నిలిచిన తెలంగాణలో జనం నాడీ పట్టేందుకు పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి.

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం మరింత వేడెక్కింది. ఎన్నికలు అంటేనే పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలతో బరిలో దిగుతాయి. ప్రజల్ని తమవైపు తిప్పుకునేందుకు అస్త్రశస్త్రాల్ని ప్రయోగిస్తుంటాయి. అసెంబ్లీ సమరం ముందు నిలిచిన తెలంగాణలో జనం నాడీ పట్టేందుకు పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్‌, బీజేపీ నేతల మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. కర్ణాటకలో గెలుపుతో మంచి ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్‌లో జూలై 2న ఖమ్మంలో జరిగిన రాహుల్ సభ మరింత జోష్ నింపింది. ఖమ్మంలో జరిగిన ఈ జనగర్జన సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాహుల్​గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.పొంగులేటితో పాటు ఆయన అనుచరులు కాంగ్రెస్‌లో చేరగా మాజీ మంత్రి జూపల్లి కూడా త్వరలో మహబూబ్‌నగర్‌లో జరిగే బహిరంగ సభలో హస్తం తీర్థం పుచ్చుకోనున్నారు.

మరోవైపు కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భేటీ అయ్యారని ప్రచారం జోరందుకుంది.కాంగ్రెస్‌లో చేరికపై ఇరువురు నేతలు చర్చించినట్టు సమాచారం.రాజగోపాల్‌రెడ్డి తిరిగి సొంతగూటికి చేరుతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.ఈనేపథ్యంలో పొంగులేటితో రాజగోపాల్‌రెడ్డి భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.అటు రాజగోపాల్‌రెడ్డి సైతం కాంగ్రెస్ నేతలతో ఫామ్‌హౌస్‌లో భేటీ అయిన విషయంపై క్లారిటీ ఇచ్చారు.అయితే తాను కాంగ్రెస్‌లో జాయిన్ అవుతారా లేదా అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.అయితే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది.

కొద్ది రోజుల క్రితం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన అన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా తిరిగి హస్తం పార్టీలోకి రావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే ప్రియాంక గాంధీని కలిసినప్పుడు కూడా రాజగోపాల్‌రెడ్డి ప్రస్తావన తీసుకువచ్చారని తెలుస్తోంది.అయితే రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్‌రావ్‌ ఠాక్రే,పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో చర్చించాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రియాంక సూచించినట్లు తెలుస్తోంది.అటు బీఆర్ఎస్​ మాజీ ఎమ్మెల్యే కూడా ఏఐసీసీ పెద్దలను తరచూ కలుస్తున్నట్లు సమాచారం.నెలాఖరున సభలు నిర్వహించి చేరికలు పూర్తయితే పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం వస్తుందని, ఎన్నికల సమయానికి కొత్త చేరికలు క్యాడర్‌లో జోష్​నింపుతాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

కర్ణాటకలో విజయం తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికలు ఊపందుకున్నాయి.ఈ క్రమంలోనే బీజేపీ, బీఆర్ఎస్ ముఖ్య నాయకులను హస్తం గూటికి రప్పించేందుకు హస్తం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఈనెల చివరి వారంలో పెద్ద ఎత్తున చేరికలు ఉండే అవకాశాలు ఉన్నట్టు కాంగ్రెస్​వర్గాలు చెబుతున్నాయి.ఇద్దరు బీఆర్ఎస్​ఎమ్మెల్సీలు కూడా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు హస్తం నేతలు అంటున్నారు.అంతేకాదు గతంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన నాయకులను ఘర్​వాపసి పేరుతో తిరిగి పార్టీలోకి రప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నారు.

Tags

Next Story