Adluri Laxman Kumar :తెలంగాణ ప్రభుత్వం మరో రెండు కొత్త పథకాలు

తెలంగాణ మైనారిటీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరో చారిత్రాత్మక అడుగు వేసింది. సచివాలయంలో రెండు కొత్త పథకాలను ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లాంచనంగా ప్రారంభించారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన, రేవంతన్నా కా సహారా – మిస్కీన్ల కోసం పేరుతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రక్రియ కు సంబంధించిన పోర్టల్ ను ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ రెండు పథకాలను ముస్లిం మైనార్టీలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడుతూ... ఈ రెండు పథకాలు మైనారిటీల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాయి. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తాయని వెల్లడించారు. వితంతువులు, విడాకులు పొందినవారు, అనాధలు, అవివాహిత మహిళలు చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి స్వయం ఉపాధి పొందేలా ఇందిరమ్మ యోజన తోడ్పడుతుందని తెలిపారు. ఫఖీర్, దుదేకుల వర్గాలకు మోపెడ్ వాహనాలు ఇవ్వడం వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చి వెంటనే అమలు చేసే నాయకుడు. ఆయన దూరదృష్టి వల్లే ఈ పథకాలు వెలువడ్డాయని పేర్కొన్నారు. ఈ రెండు పథకాలకే ప్రభుత్వం రూ.30 కోట్లు కేటాయించడం మైనారిటీల పట్ల అంకితభావానికి నిదర్శనమని తేల్చారు.తాను మంత్రి గా బాధ్యతలు స్వీకరించి రెండు నెలలు పూర్తి అయిన కొద్ది రోజుల్లోనే ఇలాంటి కొత్త పథకాలు ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. లబ్ధిదారులు ఈ సాయాన్ని కుటుంబాభివృద్ధికి వినియోగించుకోవాలనీ సూచించారు. మైనారిటీల అభివృద్ధి అంటే కేవలం సబ్సిడీలు కాదు, వారిని స్వయం ఉపాధికి దారి చూపడం మా లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ పథకాలు కుటుంబ పోషణకు తోడ్పడటమే కాకుండా, మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచుతాయని అన్నారు. చిన్న వ్యాపారాల ద్వారా సంపాదన పెరిగితే, వారిలోని యువతకు చదువులోనూ, ఉపాధిలోనూ మెరుగైన అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల కలలు సాకారం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఎవరూ వెనుకబడకుండా అందరికీ సమాన అవకాశాలు ఇవ్వడమే మా సంకల్పమన్నారు. ఈ పథకాలు తాత్కాలిక సహాయం మాత్రమే కాదు, మైనారిటీల దీర్ఘకాలిక స్థిరమైన అభివృద్ధికి పునాదని అన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com