TG : అంగన్వాడీ హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

అంగన్వాడీ హెల్పర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి పొందే గరిష్ట వయోపరిమితి నీ 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క సంబంధిత ఫైల్పై గురువారం నాడు సంతకం చేశారు.
ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 45 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు గల సుమారు 4322 మంది అంగన్వాడీ హెల్పర్లకు టీచర్లుగా పదోన్నతి పొందే అవకాశం ఏర్పడనుంది. గతంలో 45 ఏళ్లు దాటిన తర్వాత ప్రమోషన్ కోసం అవకాశాలు లేకపోయినా, ఇప్పుడు వారికీ మళ్ళీ అవకాశం లభించనుంది.
గరిష్ట వయో పరిమితిని పెంచాలని అంగన్వాడి హెల్పర్ యూనియన్ల విజ్ఞప్తి మేరకు సాధ్యసాధ్యాలను పరిశీలించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. అర్హతలు ఉన్న 50 ఏళ్ల లోపు హెల్పర్లకు టీచర్ పదోన్నతి ఇవ్వడంలో ఎలాంటి అడ్డంకులు లేవని అధికారులు నివేదిక సమర్పించారు. ఇటీవలే అంగన్వాడీ టీచర్ల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 65 ఏళ్లకు పెంచిన నేపథ్యంలో.. 50 ఏళ్ల వయస్సులో టీచర్ గా పదోన్నతి పొందే హెల్పర్లు..ఇంకా 15 ఏళ్లు విధులు నిర్వర్తించవచ్చని సూచించారు. 45 సంవత్సరాల వయస్సు దాటిన అర్హులైన హెల్పర్లకు ప్రమోషన్ ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు స్పష్టం చేయడంతో ఫైల్పై మంత్రి సీతక్క సంతకం చేశారు. దీంతో త్వరలో అధికారిక ఉత్తర్వులు వెల్లడి కానున్నాయి.
ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది అంగన్వాడీ హెల్పర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కేవలం వయస్సు కారణంగా తాము టీచర్లుగా ప్రమోషన్ కోల్పోతున్నామని బాధపడిన తమకు సీతక్క న్యాయం చేశారని తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com