Telangana Government : ప్రభుత్వ స్థలాల వేలానికి రంగం సిద్ధం..23న బహిరంగ వేలం

హైదరాబాద్లో మరోసారి ప్రభుత్వ స్థలాలు, ప్లాట్ల వేలానికి రంగం సిద్ధమైంది. రూ.3వేల కోట్ల నిధుల సమీకరణకు వీలుగా విలువైన స్థలాలను విక్రయించేందుకు హౌజింగ్ శాఖ సన్నద్ధమవుతోంది. ఇటీవలే రాష్ట్ర హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ప్లాట్ల వేలం చేపట్టగా రికార్డు స్థాయిలో ధర పలికింది. ఇదే ఊపుతో ఉన్న ప్రభుత్వం నగరంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న రాష్ట్ర హౌసింగ్ బోర్డుకు చెందిన స్థలాలను విక్రయించేందుకు సిద్ధమయింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైంది.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని గచ్చిబౌలి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని బాచుపల్లి మండలం నిజాంపేట్, కుత్బుల్లాపూర్ మండలం చింతల్లోని స్థలాలను విక్రయించాలని నిర్ణయించారు. ఈ నెల 23న బహిరంగ వేలం ద్వారా మొత్తం 22 స్థలాలను విక్రయించనున్నారు. రెండు రోజుల క్రితం కూకట్పల్లిలోని హౌసింగ్ బోర్డు కాలనీ ఫేజ్-1లో ఖాళీగా ఉన్న 18 స్థలాలను విక్రయించగా హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఓ ప్లాట్కు సంబంధించి చదరపు గజం ధర అత్యధికంగా రూ.2.98 లక్షలు పలకడం గమనార్హం. అన్ని ప్లాట్లు కలిపి సగటున చదరపు గజానికి రూ.2.38 లక్షలు పలకడం విశేషం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com