Telangana : వరద గుప్పెట్లో తెలంగాణ.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్..

తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరదలు పోటెత్తుతున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పరిస్థితి భయంకరంగా ఉంది. ఇప్పటికే ఈ జిల్లాల్లోని అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరదల కారణంగా రోడ్లపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
కామారెడ్డి జిల్లాలో వరద నీరు ఇళ్లలోకి భారీగా చేరడంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వందలాది ఇళ్లు నీట మునగడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ మరోసారి రాష్ట్రానికి హెచ్చరికలు జారీ చేసింది. వర్షాల ప్రభావం ఇలాగే కొనసాగే అవకాశం ఉందని...పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది ఐఎండీ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..అవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు అధికారులు. .
అలాగే.ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, యాదాద్రి భువనగిరి, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com