TG : ఆయిల్ పామ్ సాగుకు తెలంగాణ అనువైన ప్రాంతం : మంత్రి పొంగులేటి

తెలంగాణ ప్రాంతం ఆయిల్ పామ్ సాగుకు అనువైన ప్రాంతమని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇకపై ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పామాయిల్ సాగు, విస్తరణ పెరుగుతుందని ఆయన చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో వ్యవసాయానికి పెద్దపీట వేసినట్లు మంత్రి చెప్పారు. తెలంగాణ రైతులు సంతోషంగా ఉండేలా కాంగ్రెస్ పాలన సాగుతోందని, వారికి రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్నామని పొంగులేటి చెప్పారు. అశ్వరావుపేటలో ఆయిల్ పామ్ రైతుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్తలతో రైతులకు సాగు, విస్తరణపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. "ఆయిల్ పామ్ సాగుకు పుట్టినిల్లు అశ్వరావుపేట. మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్ చేతుల మీదుగా జిల్లాలో తొలి ఆయిల్ పామ్ మొక్క నాటారు. గత ప్రభుత్వంలో నాకున్న అవకాశంతో అశ్వరావుపేటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మించాను. తెలంగాణలో ఈ పంట సాగుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. వంట నూనెలపై దిగుమతి సుంకం పెంచాలని ఢిల్లీ వెళ్లి విజ్ఞప్తి చేశాం. ఈ మేరకు ఇంపోర్ట్ ట్యాక్స్ పెరగటం వల్ల పామాయిల్ గెలల ధర పెరిగింది. రానున్న రోజుల్లో గెలలు ధర టన్ను రూ.20వేలకు పైగా పెరుగుతుంది" అని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com