UTTHAM: బీఆర్‌ఎస్‌ నేతలు క్షమాపణ చెప్పాలి

UTTHAM: బీఆర్‌ఎస్‌ నేతలు క్షమాపణ చెప్పాలి
మేడిగడ్డ కుంగుబాటు బాధ్యులెవరో నేడో రేపో తెలుస్తుంది... తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజి చూసిన బీఆర్‌ఎస్‌ నేతలు ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పాలని తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. NDSA నివేదిక ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. మేడిగడ్డ కుంగుబాటుకు ఎవరెవరు బాధ్యులనే వివరాలతో నేడో, రేపో విజిలెన్స్ మరో నివేదిక ఇస్తుందని దీనిపై న్యాయనిపుణుల సూచనలు తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఉత్తమ్‌ స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బీఆర్‌ఎస్‌ పాపాల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికీ భాగస్వామ్యం ఉందని ఉత్తమ్ ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో భారాస తీరు ఆశ్చర్యంగా ఉందని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ధ్వంసమైన బ్యారేజీని చూసిన బీఆర్ఎస్‌ నేతలు ఇప్పటికై ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.


మేడిగడ్డ వెళ్లిన బీఅర్‌ఎస్‌ నేతల బస్సు టైర్ పేలిపోయిందని కారు సహా ఆ పార్టీ వాహనాలన్నీ ఇక షెడ్డుకేనని మంత్రి ఉత్తమ్‌ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, నిర్మాణంలో బీఅర్‌ఎస్‌ భారీ తప్పిదాలు చేసిందని.. కమీషన్లకు కక్కుర్తిపడి రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి బీఅర్‌ఎస్‌ పాపాల్లో కేంద్రంలోని భాజపా ప్రభుత్వానికీ భాగస్వామ్యం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సరైన అనుమతులు లేకుండానే కేంద్ర ప్రభుత్వ సంస్థలు వేల కోట్ల రూపాయల రుణాలు ఎలా ఇచ్చాయని ప్రశ్నించారు. వాస్తవానికి రుణాలను కేసీఆర్, కేటీఆర్ కూడబెట్టుకున్న సంపాదన నుంచే కట్టాలి కానీ.. ప్రభుత్వంపై ఆ భారం పడిందన్నారు. నాగార్జున సాగర్ నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టేందుకు వీలుగా CRPF బలగాలను తొలగించాలని కోరామన్నారు.


తెలంగాణ ప్రభుత్వ వినతి మేరకు NDSAఎన్డీఎస్ఏ కమిటీ వేయడాన్ని స్వాగతిస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను యుద్ధప్రాతిపదినక పరిశీలించి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని ఎన్డీఎస్ఏను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. నెల రోజుల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వనున్నట్లు జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ తెలిపిందన్నారు. శనివారం దిల్లీ వెళ్లి కేంద్ర అధికారులను కలిసి దీనిపై చర్చించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాజ్యాంగబద్ధమైన ఎన్డీఎస్ఏ సూచనల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టును ఎలా పునరుద్ధరించాలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పలు డాక్యుమెంట్లు, వివరాలు ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వ సలహాదారుడు పేర్కొనడం సమంజసం కాదన్నారు. జియోలాజికల్ ప్రొఫైల్, క్వాలిటీ కంట్రోల్, థర్డ్ పార్టీ రిపోర్టులు లేవు కాబట్టి తమ ప్రభుత్వం ఇవ్వలేదని వివరించారు. చాలా నివేదికలు అసలు లేవని.. గత ప్రభుత్వం పనితీరు అలా ఉందని మంత్రి అన్నారు. ఎన్డీఎస్ఏ కమిటీకి తమ వద్ద ఉన్న వివరాలు, సమాచారం పూర్తిగా ఇస్తామని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story