Telangana: ధాన్యం కొనుగోలు చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయాలు..
Telangana: తెలంగాణలో యాసంగి ధాన్యంపై మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. టీఆర్ఎస్ టార్గెట్గా బీజేపీ, కాంగ్రెస్ నేతలు తప్పు ఒప్పులు ప్రస్తావిస్తూ... ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటున్నారు. దేశంలో ఎక్కడా లేని సమస్యను తెలంగాణలో కేంద్రం సృష్టిస్తుందని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ రైతులపై వివక్ష చూపుతోందని ఆరోపించారు.
పథకం ప్రకారమే కేంద్రం వరి పంటను తగ్గిస్తుందని ఆరోపించారు మంత్రి నిరంజన్రెడ్డి. కేంద్రం మొండి వైఖరితో రైతులు నష్టపోతారని రాష్ట్ర ప్రభుత్వమే వరి ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఇక.. ఆయిల్ ఫామ్ తోటలు వేయడం ద్వారా రైతు బతుకుల్లో కొత్త వెలుగులు వస్తాయన్నారు. ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ రాజకీయ నాటకం వేశారంటూ నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. దీక్షలతో రాజకీయ లబ్ధి పొందాలని చూశారంటూ విమర్శలు గుప్పించారు.
రైతులు వాస్తవాన్ని పసిగట్టారని.. అందుకే టీఆర్ఎస్ దీక్షలో భాగస్వామ్యం కాలేదని అన్నారు.. టీఆర్ఎస్ డ్రామాలకు తెరదించకపోతే.. ప్రజలే చూసుకుంటారన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణలో 8 లక్షల 34వేల మెట్రిక్ టన్నుల బియ్యం మాయం అయ్యాయని ఆరోపించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. 2వేల 600 కోట్ల విలువైన బియ్యం మాయంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ ఆదేశాల మేరకు వరి వేయని రైతులకు ఎకరాకు 15వేలు, మిల్లర్లకు అమ్ముకున్న రైతులకు 600 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. రైతుల జీవితాలతో కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వచ్చే నాలుగు రోజులు వ్యవసాయ మార్కెట్లను సందర్శిస్తామన్నారు. డబ్బులు ఉన్నప్పుడు రైతుల నుంచి ధాన్యం ముందే ఎందుకు కొనలేదని, అంతమాత్రానికి ఢిల్లీలో ఎందుకు ధర్నా చేశారని ప్రశ్నించారు.
రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో కౌలు రైతులకు రైతుబంధు ఇస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. వరిధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య వర్డ్ వార్ కొనసాగుతోంది. కేంద్రం సైతం టీఆర్ఎస్ ప్రభుత్వానిదే తప్పని అంటుంటే, కాదుకాదు కేంద్రానిదే తప్పంటూ టీఆర్ఎస్ అంటూ నిందలు వేసుకుంటున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com