Telangana : తెలంగాణలో జిల్లాలపై జగడం..!

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి జిల్లాల పునర్వ్యవస్థీకరణ కేంద్రంగా రగడ మొదలైంది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలు, మండల కేంద్రాలపై అనేక పరిపాలనా సమస్యలు ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ఈ వ్యవస్థీకరణ వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నది కాంగ్రెస్ వాదన. ముఖ్యంగా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు జిల్లాల్లో విభజించబడటం, మరికొన్ని రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉండటం వల్ల పరిపాలన గందరగోళంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అధికారుల పనితీరుపై ప్రభావం పడుతోందని, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఆలస్యం జరుగుతోందని ఆయన అభిప్రాయం. ఇదే సమయంలో, కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల నిర్మాణాన్ని ముట్టుకుంటే తీవ్ర ఉద్యమం చేస్తామని బీఆర్ఎస్ హెచ్చరిస్తోంది.
మాజీ మంత్రి కేటీఆర్ ఈ అంశంపై పదే పదే హెచ్చరికలు జారీ చేస్తూ, జిల్లాల పునర్వ్యవస్థీకరణ పేరుతో ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటే ఊరుకునేది లేదంటున్నారు. కాంగ్రెస్ నేతలు మాత్రం ప్రజల నుంచే తమకు విజ్ఞప్తులు వస్తున్నాయని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో జిల్లా కేంద్రాలు దూరంగా ఉండటంతో ప్రభుత్వ సేవలు సకాలంలో అందడం లేదని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి రాజకీయ పక్షపాతం లేకుండా నిర్ణయం తీసుకునేందుకు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఈ ప్రకటనతో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమైంది. ఒకవైపు మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం ఎన్నికలపై ఎంతవరకు ప్రభావం చూపుతుందోనన్న చర్చ మొదలైంది. ప్రజలు పరిపాలనా ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్కు మద్దతు ఇస్తారా? లేక బీఆర్ఎస్ వాదనకు నిలబడతారా అన్నది ఆసక్తికరంగా మారింది.మొత్తానికి, జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపుగా మారింది. ఈ జగడం చివరకు ఎవరికీ నష్టం చేస్తుందో, ఎవరికీ లాభం చేకూరుస్తుందో తేలాలంటే రాబోయే రోజులు, ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలే స్పష్టమైన సమాధానం ఇవ్వనున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

