Maheshwar Reddy : బీఆర్ఎస్‌ను విలీనం చేసుకునే అవసరమే లేదు : మహేశ్వర్ రెడ్డి

Maheshwar Reddy : బీఆర్ఎస్‌ను విలీనం చేసుకునే అవసరమే లేదు : మహేశ్వర్ రెడ్డి
X

బీఆర్ఎస్ ను విలీనం చేసుకునే అవసరం బీజేపీకి లేదని, బీజేపీ ఒంటరిగా తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేసే ప్రయత్నం జరిగిందన్న ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై ఆయన గురువారం స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ నాలుగు స్తంభాలాటల మధ్య కూలిపోబోతోందని, పదవులు, ఆస్తుల కోసమే ఆ పార్టీలో అంతర్గత పోరు నడుస్తోందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కవిత కూడా పార్టీ నుండి బయటకు వెళ్లాలని చూస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ నాయకత్వంపై ఎమ్మెల్సీ కవిత అసంతృప్తి గత కొంతకాలంగా బయటపడుతోందన్నారు. కవిత తాజా వ్యాఖ్యలతో ఈ వ్యవహారం బహిరంగంగా మారిపోయిందని తెలిపారు. కవిత ఇటీవల పార్టీకి రాసిన లేఖలో తనకు జరిగిన అన్యాయాన్ని స్పష్టంగా ప్రస్తావించారని ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో తన పాత్రను పూర్తిగా విస్మరిస్తున్నారనే అభిప్రాయం ఆమెలో ఉందన్నారు.

పార్టీలో కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చినట్లే తనకూ ఇవ్వాలన్నది కవిత ఆవేదన అని ఏలేటి చెప్పారు. బీఆర్ఎస్ లో నెలకొన్న తాజా సంక్షోభంతో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన కేసీఆర్ ఇప్పుడు తానే ట్రబుల్స్ లో చిక్కుకున్నారని, పార్టీ క్యాడర్ సందిగ్ధంలో ఉందని ఏలేటి వ్యాఖ్యానించారు.

Tags

Next Story