TG : ఇది రైతు రాజ్యం...ప్రజాపాలన : మంత్రి పొంగులేటి

TG : ఇది రైతు రాజ్యం...ప్రజాపాలన : మంత్రి పొంగులేటి
X

రైతు దేశానికి వెన్నెముక. ఆ రైతుకు వెన్నుదన్నుగా నిలవాలనే ధృడ సంకల్పంతో అన్నదాతలకు ఆర్థిక సహకారం అందజేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు రుణ విముక్తి కల్పించి, చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని రెవెన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( Ponguleti Srinivas Reddy ) అన్నారు.

లక్ష రూపాయల రుణమాఫీ ఒకసారి మాఫీ చేయడం సాధ్యం కాదు, అసలు జరగదు అని ఆనాటి సీఎం కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటిస్తే, ఈనాటి మన సీఎం రేవంత్ రెడ్డిగారు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకుని అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయ్యింది. ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీకి ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం సహకరించపోయినా కూడా రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం. ఆగష్టు 15వ తేదీ లోగా రైతు రుణాలను మాఫీ చేస్తామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ, అంతకంటే నెలరోజుల ముందుగానే హామీని నిలబెట్టుకుని రైతన్నల విషయంలో తమ నిబద్ధతను చాటుకున్నామని అన్నారు.

జూలై 18వ తేదీ లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తున్నామని ఆ రోజు సాయంత్రం వరకు రైతు ఋణ ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామని ఈరోజు రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించవలసిన రోజు అని అన్నారు.

16 సంవత్సరాల క్రితం కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి సంబంధించి 72 వేల కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు, వడ్డీలను మాఫీ చేసిందని గుర్తు చేశారు.

Tags

Next Story