TG Congress : ఇంకా పెండింగ్ లో మూడు మంత్రి పదవులు..

మంత్రివర్గ విస్తరణ జరిగినప్పటికీ ఇంకా మూడు పదవులు ఖాళీగానే ఉన్నాయి. కొత్తగా ముగ్గురు మంత్రులు చేరడంతో మంత్రివర్గంలో అమాత్యుల సంఖ్య సీఎం రేవంతో కలిపి పదిహేనుకు చేరింది. రెండు, మూడు మాసాల్లో మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశాలు ఉన్నాయని, ఈ దఫా ఇప్పటిదాకా దక్కని సామాజిక వర్గాలకు ఈ విస్తరణలో అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు మంత్రివర్గాన్ని విస్తరించి, మిగిలిన సామాజిక వర్గాలకు అవకాశం కల్పిస్తామని తమను కలిసిన నేతలకు పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ హామీ ఇస్తున్నట్టు సమాచారం.
తెలంగాణలో సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించిన ప్రభుత్వం బీసీలకు 42శాతం విద్యా, ఉద్యోగ, రాజకీయరంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి పదవుల్లోనూ తమ వాటా తమకు దక్కాల్సిందేనని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ లెక్కన బీసీలకు మంత్రివర్గంలో ఆరు స్థానాలు దక్కాలని ప్రస్తుతం బీసీలు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారని, వచ్చే విస్తరణలో నైనా ఇప్పటిదాకా అవకాశం దక్కని సామాజికవర్గాలకు చోటు కల్పించాలని వివిధ బీసీ సంక్షేమ సంఘాలు, ఆ సంఘాలకు చెందిన నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com