రేపు టీఆర్‌ఎస్‌ కార్యవర్గ సమావేశం.. సీఎంగా కేటీఆర్ అంశంపై క్లారిటీ?

రేపు టీఆర్‌ఎస్‌ కార్యవర్గ సమావేశం.. సీఎంగా కేటీఆర్ అంశంపై క్లారిటీ?
రేపటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయోనని గులాబీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.

రేపు జరగనున్న టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం పై ఉత్కంఠ నెలకొంది. గత కొంతకాలంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న పార్టీకి అధినేత కేసీఆర్ బూస్టింగ్ ఇవ్వబోతున్నారా...? లేక నోరు జారుతున్న నేతలకు క్లాస్ ఇవ్వనున్నారా...? కేటీఆర్‌కు సీఎం పగ్గాలు ఇచ్చే అంశంపై కేడర్‌కు క్లారిటీ రానుందా..? ఇప్పుడు టీఆర్ఎస్ వర్గాల్లో ఇదే చర్చ. రేపటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయోనని గులాబీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.

గత ఆరు నెలలుగా టీఆర్ఎస్ పార్టీ ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. దుబ్బాక ఉప ఎన్నిక ఓటమి, జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవటంలాంటి అంశాలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. వరుస వైఫల్యాలను అధిగమించి.. రాబోయే ఎన్నికలకు ఏవిధంగా కేడర్‌ని సమాయత్తం చేయాలి అనే దానిపై పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు, రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండటంతో కార్యవర్గ సమావేశంలో చర్చించి కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం కేసీఆర్.

తెలంగాణ భవన్‌లో జరిగే ఈ సమావేసానికి రాష్ట్ర కమిటి సభ్యులతో పాటు రాష్ట్ర మంత్రులు, లోకసభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్ పర్సన్లు, జడ్పీ చైర్ పర్సన్లు, మున్సిపల్ మేయర్లు, డిసిసిబి అధ్యక్షులు, డిసిఎంఎస్ అధ్యక్షులను ఆహ్వానించారు. రెండేళ్ల తర్వాత పూర్తి కార్యవర్గ సమావేశం జరుగుతుండటంతో ప్రధాన అంశాలపై ఫోకస్ చేయనున్నారు కెసిఆర్.

మరోవైపు గత కొద్ది నెలలుగా కేటీఆర్ సీఎం అవుతారని తీవ్ర చర్చ సాగుతోంది. కేబినెట్‌లో మంత్రులే బహిరంగసభల్లో ప్రకటిస్తున్నారు. పార్టీ సీనియర్లు కూడా అదే అభిప్రాయం చెబుతున్నారు. మరో ముడునెలల్లో సీఎం పదవి వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇక రేపటి మీటింగ్ లో ఏం జరగబోతోంది..? కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ ఎలాంటి సంకేతాలు ఇవ్వనున్నారు...? వచ్చే ప్లీనరీ తర్వాత పార్టీలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయ్...? ఇప్పుడిదే చర్చ. సీఎం మార్పుపై కేసీఆర్ క్లారిటీ ఇస్తారా.? లేదంటే ఈ అంశానికి పుల్‌స్టాఫ్ పెడతారా అనేది తేలాల్సి ఉంది.

చాలా కీలక అంశాలు చర్చకు వచ్చే ఛాన్స్ ఉండటంతో రేపటి సమావేశంపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. ఏప్రిల్ 27న జరిగే పార్టీ ప్లీనరీ తరువాత ఎలాంటి పరిణామాలు ఉంటాయోనని గులాబీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story