IRCTC : మంచిర్యాలలో వందే భారత్ ఎక్స్ప్రెస్ స్టాప్..

నాగ్పూర్-సికింద్రాబాద్ మార్గంలో నడిచే వందే భారత్ రైలుకు మంచిర్యాల రైల్వే స్టేషన్లో స్టాపేజీ మంజూరైంది. ఇది మంచిర్యాల జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరడమే కాకుండా, ఈ ప్రాంత అభివృద్ధికి కొత్త మార్గం వేసిందని ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, తెలంగాణ మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ మంచిర్యాల రైల్వే స్టేషన్లో ఈ రైలు స్టాపేజీని జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన వందే భారత్ రైళ్లు నవభారతంలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాయని అన్నారు. తెలంగాణకు అన్ని రకాల నిధులు అందించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే తెలంగాణలో ఐదు వందే భారత్ రైళ్లు నడుస్తుండగా, మరో రెండు రైళ్లను ప్రారంభించేందుకు రైల్వే శాఖ సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఈ ప్రతిపాదనలపై త్వరలోనే సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తనకు మంచిర్యాలతో విద్యార్థి దశ నుంచే మంచి అనుబంధం ఉందని, ఈ రోజు ఈ జిల్లా ప్రజలకు ఒక శుభవార్త చెప్పడం ఎంతో సంతోషంగా ఉందని సంజయ్ అన్నారు. త్వరలోనే రూ.3.5 కోట్ల వ్యయంతో మంచిర్యాల రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిని మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే, రూ.26 కోట్ల అమృత్ భారత్ నిధులతో మంచిర్యాల రైల్వే స్టేషన్ను అత్యాధునికంగా, విమానాశ్రయం తరహాలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com