General Elections 2024: ఎన్నికలు సమీపిస్తున్న వేళ..పార్టీల వ్యూహాలు

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతూ ఎత్తుకు పైఎత్తులతో మాటల యుద్ధం కొనసాగిస్తూ సమరానికి సై అంటున్నాయి. మూడోసారి అధికారం దక్కించుకోవాలని బీఆర్ఎస్ పావులు కదుపుతుంటే గులాబీ పార్టీకి చెక్ పెట్టేందుకు కమలం, హస్తం ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇక ఖమ్మం కాంగ్రెస్ జనగర్జన సభలో రాహుల్గాంధీ గర్జన తర్వాత తెలంగాణలో విమర్శలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు ఒక్కసారిగా హీట్ పుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పేలుతున్న కౌంటర్లు, పొటిలికల్ డైలాగులు రాజకీయ రచ్చ రేపుతున్నాయి.
ఖమ్మం సభలో రాహుల్గాంధీ చేసిన ఆరోపణలపై గులాబీ పార్టీ నిప్పులు చెరిగింది. మంత్రులు, బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీపైనా, రాహుల్గాంధీపైనా భగ్గుమన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ ఎప్పుడూ బీ-టీమ్ కాదని ఎంపీ నామా నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. ఖమ్మం సభలో రాహుల్ అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లోను కాంగ్రెస్ పతనం ఖాయమని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
బీఆర్ఎస్ నేతలకు టీపీసీసీ రేవంత్రెడ్డి అదేస్థాయిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు లేదని తేల్చిచెప్పారు. తొమ్మిదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ఏంచేసిందో మంత్రులు కేటీఆర్, హరీష్రావు చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్రాజెక్టుల్లో అవినీతి, ప్రజల డబ్బుల్ని దోచుకోవడం, ఆస్తులను పెంచుకోవడం తప్ప రాష్ట్ర ప్రజల కోసం ఏం చేయలేదని విమర్శించారు. ఖమ్మం జనగర్జన సభలో రాహుల్ ఏమైనా తప్పులు మాట్లాడినట్టు ఉంటే ఎలాంటి శిక్షకైనా తాను సిద్దమని రేవంత్ అన్నారు.
ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శలను బీజేపీ సైతం తిప్పికొట్టింది. తెలంగాణలో బీజేపీ ఖతం అయిపోయిందన్న రాహుల్ గాంధీ కామెంట్స్పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. నాలుగు నెలలు ఆగితే ఏ పార్టీ ఖతం అవుతుందో తెలుస్తుందంటూ కౌంటర్ ఇచ్చారు. తమకు కాంగ్రెస్ ఎంత దూరమో బీఆర్ఎస్ కూడా అంతే దూరమని కిషన్రెడ్డి స్పష్టంచేశారు.
అటు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సైతం సీఎం కేసీఆర్పై ఓరేంజ్లో ఫైర్ అయ్యారు. కేసీఆర్ మాటలకు చేతలకు పోలిక లేదన్నారు. తెలంగాణ యువకులు, విద్యార్థులు, రైతులకు కేసీఆర్ మోసం చేసారని ఆరోపించారు. ఈసారి ఆరునూరైనా బీఆర్ఎస్ను ఓడించి తీరుతామన్న ఈటల దెబ్బ కొడితే కేసీఆర్ దిమ్మ తిరగాలన్నారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఈటల ధీమా వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com