TG: జహీరాబాద్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ సస్పెన్షన్

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్, డాక్టర్ శ్రీధర్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఎమర్జెన్సీ వార్డులో పవర్ సప్లై ఆగిపోయి, సెల్ఫోన్ లైట్ వెలుతురులో పేషెంట్లకు ట్రీట్మెంట్ అందించినట్లు వచ్చిన వార్తపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి, టీవీవీపీ కమిషనర్ ఘటనపై విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. పవర్ కట్ టైంలో జనరేటర్లు ఆన్ చేయకుండా ఆలస్యం చేసినట్లుగా విచారణలో తేలింది. దీంతో హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీధర్ కుమార్ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆస్పత్రుల్లో జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలని, విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని మంత్రి ఆదేశించారు. మరోసారి అన్ని ఆసుపత్రులు సూపరింటెండెంట్లకు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com