Andhra Pradesh: చెల్లికి అండగా అన్న.. ఎండ్లబండిలో సుప్రీంకోర్టు వరకు..
![Andhra Pradesh: చెల్లికి అండగా అన్న.. ఎండ్లబండిలో సుప్రీంకోర్టు వరకు.. Andhra Pradesh: చెల్లికి అండగా అన్న.. ఎండ్లబండిలో సుప్రీంకోర్టు వరకు..](https://www.tv5news.in/h-upload/2022/05/28/722447-brother.webp)
Andhra Pradesh: చెల్లెలి కష్టాలకు చలించిన ఓ అన్న పెద్ద సాహసమే చేశాడు. అత్తింటి వేధింపులు భరించలేక పుట్టింటికి వచ్చిన తోబుట్టువు కన్నీళ్లను చూసి కుమిలిపోయిన సోదరుడి పోరాటం తీరు అందర్నీ ఆలోచింపజేసింది. సోదరికి న్యాయం కోసం తీసుకున్న నిర్ణయం సంచనలనమైంది. న్యాయం కోసం తల్లితో కలిసి ఏకంగా ఢిల్లీకి ఎడ్ల బండిపై బయల్దేరాడు. సుప్రీంకోర్టు, NHRCలో న్యాయ పోరాటానికై.. రాష్ట్రాలను దాటుతూ ప్రయాణం సాగించిన తీరు సన్సేషన్ అయ్యింది.
ఏపీ రాష్ట్రంలోని NTR జిల్లా నందిగామ మండలం ముప్పాళ్ళకు చెందిన నాగ దుర్గారావు.. తన సోదరిని 2018లో చందాపురంవాసి నరేంద్రనాథ్ కిచ్చి పెళ్లి చేశారు. కట్నకానుకల కింద 23 లక్షల నగదు, నగలతోపాటు మూడు ఎకరాల పొలం ఇచ్చినట్లు పేర్కొన్నారు. వివాహం అనంతరం భర్త వేధింపులే గాక అత్తింటివారు సైతం బెదిరించి కాగితాలపై సంతకాలు చేయించుకున్నారని దుర్గారావు ఆరోపించారు.
అత్తారింటి వేధింపులపై చందర్లపాడు పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయినా..అత్తమామలు తమ పరపతి ఉపయోగించడంతో ఎలాంటి పురోగతీ లేదని ఆరోపించాడు. అందుకే విసిగివేసారి తమకు న్యాయం దొరకదని నిర్ణయానికి వచ్చే..ఎడ్ల బండిపై హస్తినకు వెళుతున్నట్లు చెప్పుకొచ్చాడు నాగ దుర్గారావు. అటు నాగా దుర్గారావు న్యాయ పోరాటంపై ఏపీ ఉన్నతాధికారులు స్పందించారు. సోదరికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇస్తూనే.. ఢిల్లీ పయనం విరమించుకోవాలని నచ్చజెప్పారు.
నాగదుర్గారావు ఒప్పు కోవటంతో సొంత గ్రామానికి ప్రత్యేక వాహనంలో తరలించారు. ఎడ్లబండిని సైతం స్వస్థలానికి చేర్చారు. అటు నాగ దుర్గారావు నిర్ణయం సరైందికాదని న్యాయవాది అభిప్రాయపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ వెళ్లటం న్యాయపరంగా చిక్కులు ఎదురౌవుతాయన్నారు. కిందిస్థాయిలో న్యాయం జరగకుంటే ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించాలన్న ఆయన.. అకారణంతో ఎడ్లను హింసించటం నేరమవుతుందని హితువుపలికారు
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com