Punjab : ఏడేళ్ల తర్వాత ఇన్స్టా రీల్లో దొరికిన భర్త.. రెండో పెళ్లి చేసుకుని పంజాబ్లో కాపురం

పెళ్లయిన ఏడాదికే గర్భవతిగా ఉన్న భార్యను వదిలేసి వెళ్లిపోయిన భర్త, ఏడేళ్ల తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్లో కనిపించి పోలీసులకు దొరికిపోయాడు. ఈ విచిత్ర ఘటన ఉత్తర్ప్రదేశ్లోని హర్దోయీ జిల్లా సండీలా ఠాణా పరిధిలో వెలుగుచూసింది. 2018లో జితేంద్ర అలియాస్ బబ్లూ అనే వ్యక్తి అదృశ్యమైనట్లు అతని భార్య షీలూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు షీలూ ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి భర్త కోసం వెతుకుతున్న ఆమెకు, ఇటీవల ఇన్స్టాగ్రామ్లో అతని రీల్ కనిపించింది. ఆ రీల్లో జితేంద్ర మరో మహిళతో సన్నిహితంగా కనిపించడం చూసి షీలూ ఒక్కసారిగా షాక్కు గురైంది.
వెంటనే షీలూ ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసింది. పోలీసుల దర్యాప్తులో జితేంద్ర మరో మహిళను వివాహం చేసుకుని పంజాబ్లోని లుధియానాలో కాపురం పెట్టినట్లు తెలిసింది. రెండో భార్య ముచ్చటపడి చేసిన ఈ రీల్ సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో జితేంద్ర గుట్టు రట్టయింది. షీలూ ఫిర్యాదు మేరకు పోలీసులు జితేంద్రపై చీటింగ్ కేసు నమోదు చేశారు. సండీలా పోలీసులు లుధియానా వెళ్లి జితేంద్రను పట్టుకొచ్చారు. ప్రస్తుతం నిందితుడిని విచారిస్తున్నట్లు సర్కిల్ అధికారి సంతోష్కుమార్ సింగ్ మంగళవారం తెలిపారు. ఇన్స్టాగ్రామ్ రీల్ ఒక మోసగాడిని పట్టించిన ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com