Philippine Ferry : ఓడలో అగ్ని ప్రమాదం.. 31మంది మృతి

దక్షిణ ఫిలిప్పీన్స్ లోని ఓ షిప్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 31మంది మృతిచెందగా, మరికొందరు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. బుధవారం అగ్ని ప్రమాదం జరుగగా శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీస్తున్నారు. మిండానావో ద్వీపంలోని జాంబోంగా సిటీ నుంచి సులు ప్రావిన్స్లోని జోలో ద్వీపానికి షిప్ ప్రయాణిస్తుండగా ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన వెంటనే పలువురు నీళ్లలో దూకినట్లు అధికారులు తెలిపారు.
అగ్నిప్రమాదంలో 31మంది చనిపోగా, పలువురు గల్లంతైనట్లు అధికారులు ప్రకటించారు. మొదట 13మృతదేహాలు దొరికాయని, ఆ తర్వాత మరో 18 మృతదేహాలు లభ్యమైనట్లు చెప్పారు. మత్స్యకారులతో సహా 195 మంది ప్రయాణికులను, 35 మంది సిబ్బందిని రక్షించారు. పద్నాలుగు మంది గాయపడగా, ఏడుగురు గల్లంతయ్యారు. ఓడలో కెపాసిటీకి మించి ప్రయాణిస్తున్నందు వల్లనే మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని అధికారులు చెప్పారు. మంటలు ఎలా చెలరేగాయనేది తెలియరాలేదని, క్షతగాత్రులను జాంబోంగా, బాసిలన్లకు తరలించినట్లు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com