Bangladesh: డ్రైవర్ నిర్లక్ష్యానికి 18 మంది బలి

బంగ్లాదేశ్లో శనివారం జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. భండారియా ఉప జిల్లా నుంచి ఫిరోజ్పూర్కు 70 మందితో వెళ్తున్న బస్సు ఝలకతి సదర్ ఉపజిల్లా పరిధిలోని ఛత్రకాండ ప్రాంతంలో అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. డ్రైవర్ అతిగా వేగం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఏడుగురు మైనర్లు, ఐదుగురు మహిళలు ఉన్నారు.
భండారియా ఉప జిల్లా నుంచి ఫిరోజ్పూర్కు బస్సు వెళుతుండగా స్థానిక యూనియన్ పరిషత్ కార్యాలయం సమీపంలో ఆటో రిక్షాకు సైడ్ ఇస్తుండగా ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఝలకతి జిల్లా ఆసుపత్రికి తరలించారు. బస్సులో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. చెరువులో నుంచి బస్సును బయటకు తీసేందుకు పోలీసులు క్రెన్ లను ఉపయోగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com