America : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ముగ్గురు పోలీసులు మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. పెన్సిల్వేనియాలో జరిగిన ఒక దారుణ ఘటనలో ముగ్గురు పోలీసు అధికారులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ఇద్దరు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. గృహ హింసకు సంబంధించిన ఒక కేసు విచారణ కోసం వెళ్లిన అధికారులపై ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో నిందితుడు కూడా హతమయ్యాడని అధికారులు తెలిపారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఈ విషాదం బుధవారం మధ్యాహ్నం పెన్సిల్వేనియాలోని కొడొరస్ టౌన్షిప్లో చోటుచేసుకుంది. ఒక రోజు క్రితం నమోదైన గృహ హింస కేసు విచారణలో భాగంగా పోలీసులు అక్కడికి వెళ్లారని స్టేట్ పోలీస్ కమిషనర్ క్రిస్టోఫర్ పారిస్ తెలిపారు. "గృహ హింసకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా వెళ్లిన అధికారులపై ఈ దాడి జరిగింది" అని ఆయన వివరించారు.
గవర్నర్ దిగ్భ్రాంతి. ఈ ఘటనపై పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన ఇద్దరు అధికారుల పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం నిలకడగా ఉందని ఆయన తెలిపారు. "ఈ రాష్ట్రం, ఈ దేశం కోసం సేవ చేసిన ముగ్గురు అమూల్యమైన ప్రాణాలను కోల్పోయాం" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన పోలీసు అధికారుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై లోతైన విచారణ కొనసాగుతోంది. మరణించిన అధికారులు మరియు నిందితుడి వివరాలను పోలీసులు ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com