China: మళ్లీ రెచ్చిపోయిన చైనా, అరుణాచల్ పై మొండి వాదన

అరుణాచల్ ప్రదేశ్పై మొండి వాదన చేస్తోన్న చైనా మరోసారి నోరు పెంచింది. ఇవాళ కూడా అదే మాట చెప్పింది. వాటిని అసంబద్ధమైన, హాస్యాస్పదమైనవంటూ భారత్ తోసిపుచ్చుతున్నప్పటికీ.. డ్రాగన్ మాత్రం నోరు మూయడం లేదు. ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ దీటుగా సమాధానం ఇచ్చిన తరుణంలో చైనా మరోసారి స్పందించింది. అరుణాచల్ను భారత్ అన్యాయంగా ఆక్రమించుకొందని మరోసారి నోరు పారేసుకుంది.
అరుణాలప్రదేశ్ పై చైనా వాదనలు ఇప్పటికీ అసంబద్ధంగా, హాస్యాస్పదంగా ఉన్నాయని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ శనివారం నాడు వ్యాఖ్యానించారు. చైనా ఇలా చెబుతుండడం కొత్తేమీ కాదని అన్నారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ నేడు ఓ ప్రకటనలో స్పందించారు.
‘భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదం ఎన్నడూ పరిష్కారం కాలేదు. గతంలో అది చైనాలో భాగంగా ఉండేది. ఆ ప్రాంతంలో చైనా పరిపాలన కూడా సాగేది. 1987లో భారత్ ఆక్రమించుకొని అరుణాచల్ ప్రదేశ్గా రూపొందించుకుంది’ అని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ పేర్కొన్నారు. ఈ చర్యలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూనే ఉన్నామని.. దీనిపై చైనా వైఖరిలో మార్పు లేదన్న మొండి వాదనను కొనసాగించారు. భారత్ చర్యలను నిరసిస్తూ తాము స్పష్టమైన ప్రకటనలు చేశామని చెప్పారు. ఆక్రమించినంత మాత్రాన ఝాంగ్ నాన్ భారత్ సొంతం కాదని, చైనా వాస్తవ భౌగోళిక స్థితిలో ఎలాంటి మార్పు లేదని విషయాన్ని నొక్కి చెప్పామని లిన్ జియాన్ స్పష్టం చేశారు.
ఇటీవల అరుణాచల్లో ప్రధాని మోదీ పర్యటనతో ఉలిక్కిపడిన చైనా.. అది తమ భూభాగమేనని చెప్పడం మొదలుపెట్టింది. ఇలా మాట్లాడటం గత నెల రోజుల్లో ఇది నాలుగోసారి. అయితే, చైనా వ్యాఖ్యలపై భారత్ దీటుగా బదులిస్తోంది. ‘ఇది కొత్త విషయం కాదు. చైనా ఆరోపణలు చేస్తూనే ఉంటుంది. తాజాగా వాటిని మరింత పెంచింది. అవి మొదటినుంచీ హాస్యాస్పదంగానే ఉన్నాయి. ఇప్పుడు కూడా అంతే’ అని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఇటీవల పేర్కొన్నారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్కు చెందిన సౌత్ ఏషియన్ స్టడీస్లో ప్రసంగించిన సమయంలో పలువురు అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా సమాధానమిచ్చారు. వీటిపైనే చైనా మళ్లీ ఇలా స్పందించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com