International Flights Ban: ఆగస్టు 31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు

International Flights Ban: దేశంలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్న వేళ అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. విమాన సర్వీసుల రద్దును ఆగస్టు 31 వరకు కొనసాగించనున్నట్టు పౌర విమానయాన నియంత్రణ సంస్థ - డీజీసీఏ ప్రకటించింది. పరిమిత మార్గాల్లో మాత్రమే ప్రయాణికుల విమానాలు కొన్నింటిని నడపనున్నట్టు తెలిపింది. కరోనా కట్టడిలో భాగంగా గతేడాది మార్చి 23 నుంచి అన్ని అంతర్జాతీయ సర్వీసులనూ నిలిపివేయగా.. ఆ తర్వాత దాన్ని జులై 31వరకు పొడిగిస్తూ డీజీసీఏ నిర్ణయం తీసుకుంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు నెలాఖరు వరకు విమానాల రద్దు నిర్ణయాన్ని పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.
కరోనా వైరస్ ఉద్ధృతితో గతేడాది మార్చి నుంచి అంతర్జాతీయ పాసింజర్ విమాన సర్వీసుల్ని నిలిపివేసినప్పటికీ వందేభారత్ మిషన్ కింద కొన్ని దేశాలకు ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. మరోవైపు, అమెరికా, యూకే, యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ సహా దాదాపు 24 దేశాలకు విమానాలు నడపడంపై కేంద్రం ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ప్రత్యేక అంతర్జాతీయ విమాన సర్వీసులు అందించనున్నాయి. అయితే, తాజాగా ప్రకటించిన నిబంధనలు కార్గో విమానాలకు మాత్రం వర్తించవని డీజీసీఏ స్పష్టంచేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com