India-China: భారత్-చైనా సరిహద్దు వివాదం ?

India-China: భారత్-చైనా సరిహద్దు వివాదం ?
సాయుధ ఘర్షణ తప్పదంటున్న అమెరికా నిఘా వర్గాలు

భారత్‌-చైనా సైన్యాల మధ్య మరోసారి సాయుధ ఘర్షణ జరిగే ప్రమాదం ఉందని అమెరికా నిఘావర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు అమెరికాకు చెందిన డైరెక్టర్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌-DNI ఇటీవల విడుదలచేసిన వార్షిక నివేదికలో పేర్కొంది. ఇప్పటికే ఇరుదేశాలు భారీసంఖ్యలో తమ దళాలను సరిహద్దులకు తరలించాయని పేర్కొంది. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్నాయని, అందుకు సరిహద్దు వివాదం ప్రధాన కారణంగా మారినట్లు తెలిపింది. 2020తర్వాత సరిహద్దుల వెంట ఇరుదేశ సైన్యాల మధ్య ఘర్షణలు జరగకపోయినా ఇరువైపులా బలగాల మోహరింపు మాత్రం భారీగా పెరిగినట్లు అమెరికా నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఇలాంటి సమయంలో అపోహలు, తప్పుడు అంచనాలతో సాయుధ ఘర్షణల ముప్పు పొంచి ఉంటుందని డీఎన్‌ఐ తన నివేదికలో వెల్లడించింది.

2020 మే నెలలో జరిగిన గల్వాన్‌ లోయ ఘర్షణ తర్వాత నుంచి భారత్‌-చైనాలు సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ముమ్మరంగా చేపడుతున్నట్లు అమెరికా నిఘా విభాగం తన నివేదికలో పేర్కొంది. లద్దాఖ్‌ సెక్టార్‌లో ఇరుదేశాలు 50వేల చొప్పున బలగాలను మోహరించినట్లు వెల్లడించింది. సరిహద్దు ప్రాంతాల్లో ప్రశాంత పరిస్థితులు నెలకొననంత వరకు ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థితికి వచ్చే అవకాశం లేదని భారత్‌ ఇదివరకే స్పష్టం చేసింది. మరోవైపు...ఇస్లామాబాద్‌ కవ్వింపుచర్యలకు దిగితే భారత్‌-పాక్‌ మధ్య సాయుధ ఘర్షణ జరిగే ప్రమాదం ఉన్నట్లు డీఎన్‌ఐ అంచనా వేసింది. 2021 తర్వాత ఇరుదేశాలు కాల్పుల విరమణ ఒప్పందం తిరిగి చేసుకోవటంతో... ఉద్రిక్తతలు తగ్గినట్లు పేర్కొంది. ఈ సమయాన్నిఇరుదేశాలు ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నించకుండా దేశీయ అంశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపింది. భారత్‌ ఎన్నికల సన్నాహాలు, ప్రచారంపై దృష్టి సారించగా...పాకిస్థాన్పశ్చిమప్రాంతంలో మిలిటెంట్‌ దాడులతో సతమతమవుతున్నట్లు అమెరికా నిఘా విభాగం పేర్కొంది.

భారత్‌కు పొరుగున ఉన్న దేశాలతోపాటు ఇతరప్రాంతాల్లో సైనిక స్థావరాల ఏర్పాటుపై చైనా దృష్టి సారించినట్లు అమెరికా నిఘా విభాగం అంచనా వేసింది. విదేశాల్లో తన అధికారం, ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా సైనిక స్థావరాల ఏర్పాటు ప్రయత్నాల్లో...డ్రాగన్‌ ఉన్నట్లు తెలిపింది. ఇప్పటికే జబౌటీ, కంబోడియాలో సైనిక స్థావరాలు ఏర్పాటు చేసిన చైనా...మయన్మార్‌, క్యూబా, పాకిస్థాన్‌, సీషెల్స్‌, శ్రీలంక, తజికిస్థాన్‌, UAE, టాంజానియా తదితర దేశాలపై దృష్టి సారించినట్లు...అమెరికా నిఘా విభాగం వెల్లడించింది. మరోవైపు... సైబర్‌ ఆపరేషన్లకు కూడా చైనా పదునుపెట్టే ప్రమాదం ఉందని...అమెరికా నిఘా విభాగం అంచనా వేసింది. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకొనే ప్రమాదం ఉందని హెచ్చరించింది..

Tags

Read MoreRead Less
Next Story