PIB Fact Check: భారత్‌ గగనతలాన్ని అమెరికా వినియోగించ లేదు

PIB Fact Check: భారత్‌ గగనతలాన్ని అమెరికా వినియోగించ లేదు
X
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులను ఖండించిన పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ ..

ఇరాన్‌ అణ్వాయుధ కేంద్రాలపై దాడుల కోసం అమెరికా యుద్ధ విమానాలు మన గగనతలాన్ని వినియోగించుకున్నాయని జరుగుతున్న ప్రచారాన్ని భారత్‌ ఖండించింది. ఇది తప్పుడు ప్రచారమని, ఇందులో వాస్తవం లేదని స్పష్టం చేసింది. భారత గగనతలాన్ని వాడుకునే అమెరికా విమానాలు ఇరాన్‌పై భీకర దాడికి పూనుకున్నాయంటూ పలు సామాజిక మాధ్యమాల్లో ఆదివారం ప్రచారం జరిగింది. దీనిని సమాచార ప్రసార శాఖ మంత్రిత్వ శాఖలోని పీఐబీ ఖండించింది.

ఆపరేషన్‌ ‘మిడ్‌నైట్‌ హ్యామర్‌’ పేరుతో ఇరాన్ లోని అణు స్థావరాలపై అగ్రరాజ్యం అమెరికా విరుచుకుపడిన విషయం తెలిసిందే. అయితే, ఈ దాడుల కోసం వినియోగించిన యూఎస్ విమానాలు భారత గగనతలాన్ని ఉపయోగించుకున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక, వీటిని భారత్‌ తీవ్రంగా ఖండించింది. సంబంధిత పోస్టులు అన్ని నకిలీవిగా తేల్చింది. ఆ ఆపరేషన్‌ సమయంలో భారత గగనతలాన్ని అమెరికా వినియోగించుకోలేదని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ వెల్లడించింది. ఈ దాడుల్లో పాల్గొన్న అమెరికా విమానాలు పయనించిన మార్గాలను ఆ దేశ జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఛైర్మన్‌ జనరల్‌ డేనియల్ కెయిన్‌ మీడియా సమావేశంలో వివరించారని తెలిపింది.. సంబంధిత వీడియో లింక్‌ను ఫ్యాక్ట్ చెక్ పోస్ట్‌ చేసింది.

అయితే, ఇజ్రాయెల్‌- ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. తాజాగా అమెరికా దాడులతో అక్కడి పరిస్థితి మరింత దిగజారి పోయింది. తమ అణు కేంద్రాలపై దాడులకు పాల్పడిన వాషింగ్టన్‌ హద్దులు దాటింది, తర్వాత పరిణామాలకు పూర్తి బాధ్యత వహించాలని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హెచ్చరించారు. మరోవైపు ఇరాన్‌ అధ్యక్షుడు షెజెష్కియాన్‌తో ఫోన్‌లో మాట్లాడిన భారత ప్రధాని మోడీ.. దౌత్య మార్గంలో సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు.

Tags

Next Story