Crude Oil : విఫలమైన చర్చలు.. భారీగా పెరిగిన ముడిచమురు ధరలు.. సామాన్యుడిపై ధరల భారం తప్పదా?

Crude Oil : విఫలమైన చర్చలు.. భారీగా పెరిగిన ముడిచమురు ధరలు.. సామాన్యుడిపై ధరల భారం తప్పదా?
X

Crude Oil : ప్రపంచ దేశాలను వణికిస్తున్న యుద్ధ మేఘాలు ఇప్పుడు మరింతగా ముదిరాయి. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు ఎటువంటి ఫలితం లేకుండా ముగియడంతో అంతర్జాతీయంగా ఆందోళనలు మొదలయ్యాయి. ఈ చర్చల విఫలం వెనువెంటనే చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోసే కీలక జలమార్గంపై ఆంక్షలు విధించడంతో మున్ముందు గడ్డు పరిస్థితులు తప్పవని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇస్లామాబాద్‌లో జరుగుతున్న దౌత్య చర్చల ద్వారా పశ్చిమ ఆసియాలో శాంతి నెలకొంటుందని ప్రపంచ దేశాలు ఆశగా ఎదురుచూశాయి. కానీ, ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ఆ ఆశలు నీరుగారిపోయాయి. ఈ వార్త బయటకు రాగానే అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో ప్రకంపనలు మొదలయ్యాయి. గ్లోబల్ బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 8.36 శాతం పెరిగి 103.16 డాలర్లకు చేరుకుంది. అదేవిధంగా అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్ కూడా 8.22 శాతం పెరుగుదలతో 104.57 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఐరోపాలో గ్యాస్ ధరలు ఏకంగా 18 శాతం ఎగబాకడం చూస్తుంటే రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

హోర్ముజ్ జలసంధి దిగ్బంధం - అసలేం జరుగుతోంది?

ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో సింహభాగం ప్రయాణించే హోర్ముజ్ జలసంధి ఇప్పుడు యుద్ధానికి కేంద్రబిందువుగా మారింది. అమెరికా సైనిక విభాగం సెంటమ్ సోమవారం నుంచి ఇరాన్ ఓడరేవులకు వచ్చే నౌకలను అడ్డుకోవాలని నిర్ణయించింది. కేవలం ఇరాన్‌తో సంబంధం ఉన్న నౌకలను మాత్రమే ఆపుతామని, ఇతర దేశాల వ్యాపార నౌకలకు ఇబ్బంది ఉండదని అమెరికా చెబుతున్నప్పటికీ, ఆ ప్రాంతంలో సైనిక కదలికలు పెరగడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఫిబ్రవరిలో ఇరాన్‌పై జరిగిన దాడులప్పటి నుంచే ఈ మార్గం ప్రమాదకరంగా మారింది, ఇప్పుడు అమెరికా తీసుకున్న నిర్ణయం ఆ పరిస్థితిని మరింత దిగజార్చింది.

విభేదాలకు కారణం అదేనా?

చర్చల వైఫల్యానికి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. యుద్ధం ఆపాలని తాము ఎంతో చిత్తశుద్ధితో ప్రయత్నించామని, తీరా ఒప్పందంపై సంతకం చేసే సమయానికి అమెరికా కొత్త షరతులు పెట్టిందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘచీ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, ఇరాన్ తన అణ్వాయుధ తయారీని పూర్తిగా మానుకుంటుందని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వకపోవడం వల్లే తాము ఒప్పందం చేసుకోలేదని అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ స్పష్టం చేశారు. ఒప్పందం కుదరకపోవడమే కాకుండా, ఇరాన్ తన రివల్యూషనరీ గార్డ్స్ ద్వారా అమెరికా యుద్ధ నౌకలను అడ్డుకుంటామని హెచ్చరించడం ఉద్రిక్తతలను పెంచింది.

భారత్ వంటి దేశాలకు పెను ముప్పు

చమురు అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాలకు ఇది పెద్ద దెబ్బ. ఏప్రిల్ 22తో యుద్ధ విరమణ గడువు ముగియనుంది. ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అన్న భయం ప్రపంచ మార్కెట్లను వెంటాడుతోంది. ముడిచమురు ధరలు 100 డాలర్లకు పైనే కొనసాగితే, భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడమే కాకుండా నిత్యావసరాల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ దౌత్య విఫలం కేవలం రెండు దేశాల సమస్యగా మిగలకుండా ప్రపంచ దేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తోంది.

Tags

Next Story