PM Modi: మోడీ, నెతాన్యహు ఫోన్ సంభాషణ..

ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రారంభించిన “ఆపరేషన్ రైజింగ్ లయన్” నేపథ్యంలో ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతాన్యహు భారత ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడారు. ఈ సంభాషణలో మోడీ ప్రస్తుత పరిస్థితులపై తన ఆందోళనను వ్యక్తపరిచారు. అలాగే ఆ ప్రాంతంలో తొందరగా శాంతి, స్థిరత్వం తిరిగి నెలకొనాల్సిన అవసరాన్ని బెంజమిన్ నెతాన్యహుకు తెలిపారు. మోడీ తన అధికారిక X (ట్విట్టర్) ఖాతాలో.. “ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యహు ఫోన్లో నన్ను సంప్రదించారు. ఆయన ప్రస్తుత పరిస్థితులను వివరించారు. నేను భారత దేశం తరఫున ఆందోళనను వ్యక్తపరిచి, శాంతి పునరుద్ధరణ అవసరాన్ని వ్యక్తం చేశానని పేర్కొన్నారు.
ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్పై పలు మిలటరీ, అణు కేంద్రాలపై సుదీర్ఘ దాడులు జరిపాయి. ఈ దాడుల్లో ఇరాన్ విప్లవ గార్డ్స్ కమాండర్ జనరల్ హొసెయిన్ సలామీ, సైనిక ప్రధానాధికారి జనరల్ మోహమ్మద్ బఘెరి సహా పలువురు ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు మృతి చెందారు. ఈ ఘటనల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారత విదేశాంగ శాఖ కూడా ఉదయం ఒక ప్రకటనలో స్పందించింది. అందులో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తాజా పరిణామాలపై తీవ్ర ఆందోళన ఉంది. అణు స్థావరాలపై దాడుల గురించి వస్తున్న నివేదికలను గమనిస్తున్నామని పేర్కొంది. అలాగే, ప్రస్తుత పరిస్థితిని సావధానంగా చర్చల ద్వారానే పరిష్కరించాల్సిన అవసరం ఉంది అని హితవు పలికింది. భారత్ ఇరాన్, ఇజ్రాయెల్ రెండు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉందని, అవసరమైతే సహాయం అందించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది.
ఈ ఘర్షణ నేపథ్యంలో భారత్లోని ఇరాన్, ఇజ్రాయెల్ మద్దతుదారులు, అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం పడే అవకాశాలు ఉండటంతో పరిస్థితిని భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా గమనిస్తోంది. ప్రధాని మోడీ విన్నవించిన శాంతియుత పరిష్కారాల దిశగా చర్యలు ప్రారంభమవుతాయా అనేది చూడాలిమరి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com