Jaish-e-Mohammed: కశ్మీర్ కోసం బంగ్లా , పాక్ కలిసి పోరాడాలి.. మరో ఉగ్ర దాడికి ప్లాన్..?

: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ చేస్తున్న విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అటు భారత పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాదుల కదలికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రాజధాని ఢాకాలో ఇటీవల కొందరు వ్యక్తులు భారత వ్యతిరేక నినాదాలు చేయడం కలకలం రేపింది. దీని వెనుక పాకిస్థాన్కు చెందిన జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల హస్తం ఉన్నట్లు బలమైన ఆరోపణలు వస్తున్నాయి. ఈ పరిణామం భారత్ తూర్పు సరిహద్దు భద్రతకు కొత్త సవాల్గా మారింది.
ఢాకాలో జరిగిన ఈ నిరసనలో జహీర్ అనే వ్యక్తి కీలక పాత్ర పోషించాడు. "కశ్మీర్ కోసం బంగ్లాదేశ్, పాకిస్థాన్ కలిసికట్టుగా పోరాడాలి" అని బహిరంగంగా పిలుపునిచ్చాడు. బంగ్లాదేశ్లోని కొన్ని రాడికల్ శక్తులు, పాకిస్థానీ ఉగ్రవాదులతో చేతులు కలుపుతున్నాయనడానికి ఈ ఘటనే నిదర్శనమని భద్రతా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది భారత్కు అత్యంత ఆందోళన కలిగించే విషయం.
భారత్, బంగ్లాదేశ్తో దాదాపు 4,000 కిలోమీటర్లకు పైగా సరిహద్దును పంచుకుంటోంది. ఇది మన దేశానికి ఉన్న అంతర్జాతీయ సరిహద్దుల్లో అత్యంత పొడవైనది. ఇలాంటి సున్నితమైన సరిహద్దుకు సమీపంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరగడం లేదా రాడికల్ భావజాలం వ్యాప్తి చెందడం ఏమాత్రం మంచిది కాదు. బంగ్లాదేశ్లో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలను భారత భద్రతా ఏజెన్సీలు నిశితంగా గమనిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

