Pakistan: పాకిస్తాన్‌లో మరో ఇద్దరు భారత వ్యతిరేక ఉగ్రవాదులు హతం

Pakistan: పాకిస్తాన్‌లో మరో ఇద్దరు భారత వ్యతిరేక ఉగ్రవాదులు హతం
X
పాక్‌లో ప్రాణభయంతో ఉగ్రవాదులు..

పాక్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్ర సంస్థలకు వరుసగా భారీ షాక్‌లు తగులుతున్నాయి. పాక్‌లో నివాసం ఉంటున్న ఉగ్రవాదులే లక్ష్యంగా గుర్తు తెలియని వ్యక్తులు హత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో ఇద్దరు భారత వ్యతిరేక ఉగ్రవాదుల్ని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. నిషేధిత లష్కరే తోయిబాకు చెందిన మహ్మద్ ముజామిల్, నయీమూర్ రెహ్మన్‌లను సియాల్‌కోట్ నగరంలో హతమార్చారు. పోలీస్ యూనిఫాం ధరించిన ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి కాల్చి చంపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దర్ని కాల్చివేసి అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో మహ్మద్ షాజాద్, అలీ హసన్ అనే ఇద్దరు పాదచారులకు గాయాలయ్యాయి.

ఈ ఘటనపై సియాల్‌కోట్ జిల్లా పస్రూర్ డీఎస్పీ రాహా మహ్మద్ షాబాజ్ పోలీస్ అధికారుల బృందంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న ఓ సీసీ కెమెరాలో ఈ హత్యలకు సంబంధించిన వీడియోలు రికార్డయ్యాయి. దీనిపై విచారణ జరుపుతున్న పోలీసులు భూవివాదం కారణంగా ఈ కాల్పులు జరిగాయని పేర్కొన్నారు.


అయితే గత 20 నెలలుగా పాక్‌లో 19 మంది ముష్కరులు హతం కావడం సంచలనంగా మారుతోంది.రెండు రోజుల క్రితం లష్కరే తోయిబా టాప్ కమాండర్ అక్రమ్ ఖాన్ ఘాజీ దారుణ హత్యకు గురయ్యారు. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు అక్రమ్ ఖాన్ ఘాజీని హత్య చేసినట్లు స్థానిక మీడియా కథనాలు తెలిపాయి. అయితే భారత్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులు వరుసగా హతం అవుతున్నారు. అంతకుముందు మ్మూలోని సుంజువాన్ ఆర్మీ క్యాంప్‌పై 2018 దాడికి సూత్రధారి అని నమ్ముతున్న ఖ్వాజా షాహిద్ అనే ఉగ్రవాదిని పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoJK) లో కిడ్నాప్ చేసి, తల నరికి చంపేశారు. అక్టోబరులో, మసూద్ అజార్ యొక్క విశ్వసనీయ సభ్యుడిగా కూడా పరిగణించబడే దౌద్ మాలిక్, వజీరిస్థాన్‌లో పట్టపగలు హత్య చేయబడ్డాడు. వీరే కాకుండా జమాతే ఉద్ దావా, లష్కర్ ఉగ్రవాది హఫీస్ సయీద్ అత్యంత సన్నిహితుడు మాలిక్, ముఫ్తీ ఖైజర్ ఫరూఖ్‌ని కూడా గత నెలలో ఇలాగే హత్యలు చేశారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పాక్ గడ్డపై హతమైన భారత వ్యతిరేక ఉగ్రవాదుల సంఖ్య 20ని దాటింది.

Tags

Next Story