Maldives: తమ దేశం నుంచి భారత సేనను ఉపసంహించుకోమని కోరిన మాల్దీవుల అధ్యక్షుడు

Maldives:  తమ దేశం నుంచి భారత సేనను  ఉపసంహించుకోమని కోరిన మాల్దీవుల అధ్యక్షుడు
చైనాతో దోస్తికి మాల్దీవుల అధ్యక్షుడు తహతహ

తమ దేశం నుంచి భారత్ తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని మాల్దీవుల సర్కారు స్పష్టం చేసింది. ఈ మేరకు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు కార్యాలయం నుంచి శనివారం అధికారిక ప్రకటన వెలువడింది. మాల్దీవుల కొత్త అధ్యక్షుడిగా ముయిజ్జు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈనేపథ్యంలో శనివారం కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు ఆయనతో మర్యాపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత సైనికులను ఉపసంహించుకోవాలని కోరినట్లు అధ్యక్ష కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల సందర్భంగా మాల్దీవుల నుంచి ఇండియన్‌ మిలిటరీని తిరిగి పంపిస్తామని ముయిజు అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. ఆయన గెలుపు నేపథ్యంలో ఆ హామీని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు.

అయితే హిందూ మహాసముద్రంలో కీలకమైన పొరుగుదేశం కావడంతోపాటు, అక్కడ అనేకమంది భారతీయులు నివసిస్తుండటం గురించి రిజిజు ప్రస్తావించారు. అందువల్ల నిర్మాణాత్మక సంబంధాలను పెంచుకునేందుకు, దేశాల ప్రజల మధ్య సంబంధాల బలోపేతానికి ఎదురుచూస్తున్నామని చెప్పారు. కాగా, హిందూ మహాసముద్రంలో చైనా ఆధిపత్యం పెరుగుతున్న నేపథ్యంలో దానిని అడ్డుకోవడానికి మాల్దీవులు చాలా అవసరం. ఈనేపథ్యంలో 70 మంది సైనికులను భారత్‌ అక్కడ మోహరించింది. అక్కడి నుంచి రాడార్లు, నిఘా విమానాలను నిర్వహిస్తున్నది. దీంతోపాటు ఎకనమిక్‌ జోన్‌కు భారత యుద్ధ నౌకలు గస్తీ కాస్తున్నాయి.


సైన్యం ఉపసంహరణ అంశంపై విదేశాంగ శాఖ వర్గాలు స్పందిస్తూ.. అర్ధవంతమైన పరిష్కారంపై భారత్, మాల్దీవుల ప్రభుత్వ చర్చిస్తున్నాయని పేర్కొన్నారు. భౌగోళికంగా అత్యంత కీలకమైన సముద్ర ప్రాంతంలో ఉన్న మాల్దీవుల్లో దాదాపు 70 మంది వరకూ భారతీయ సైనికులు ఉన్నారు. రాడార్ల నిర్వహణ, విమానాల నిఘా వంటి కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.. భారత యుద్ధ నౌకలు మాల్దీవుల ప్రత్యేక ఎకనమిక్ జోన్ల గస్తీ దళాలకు సహకరిస్తున్నాయి. విదేశీ దళాల ఉపసంహరణ డిమాండ్‌తో ఎన్నికల్లో గెలిచిన మయిజు.. అధికారంలోకి వచ్చిన వెంటనే తన హామీని అమలు చేస్తున్నారు. చైనా అధ్యక్షుడి ప్రత్యేక రాయబారి షెన్ యికిన్ ప్రెసిడెంట్ ముయిజును మర్యాదపూర్వకంగా కలిసన రోజున భారత దళాలపై మాల్దీవుల ప్రకటన వచ్చింది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మయిజుకు చైనా రాయబారి అభినందనలు తెలిపారు. ఆ పాలన కాలంలో రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడతాయని విశ్వాసం వ్యక్తం చేసినట్లు మాల్దీవుల అధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story