PM Modi : పాకిస్తాన్ కు మోడీ రావాల్సింది : నవాజ్ షరీఫ్

పాకిస్థాన్లో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొనడంపై పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ స్పందించారు. ఇది సానుకూల పరిణామమన్నారు. ఈ సదస్సుకు ప్రధాని మోదీ వస్తే మరింత సంతోషించేవాడినన్నారు. భారత్కు చెందిన ఓ జాతీయ వార్తా ఛానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. ఇరుదేశాలు గతాన్ని పక్కన పెట్టి.., ఇంధనం, వాతావరణ మార్పుల వంటి భవిష్యత్తు సవాళ్లను పరిష్కరించుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు ఎస్సీవో సదస్సు కోసం పాకిస్థాన్ వెళ్లిన భారత జర్నలిస్టులతో నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మరియం నవాజ్లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. లాహోర్లోని ఆయన నివాసంలో మీడియా ప్రతినిధులతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్థాన్లో పర్యటించడం తొలి అడుగుగా అభివర్ణించారు. ఇదిలాఉంటే, భారత జర్నలిస్టులతో షరీఫ్ ప్రత్యేకంగా సమావేశం కావడంపై కొన్ని పాక్ మీడియా సంస్థలు భిన్నంగా స్పందించాయి. తమ జర్నలిస్టులకూ అలాంటి అదృష్టం వస్తే బాగుండేదని పేర్కొనడం గమనార్హం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com