Shehbaz Sharif: భారత్ రష్యా సంబంధాలపై పాక్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..

భారత్తో రష్యాకు గల సంబంధాలపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీతో మాస్కోకు ఉన్న బంధం తమకు పూర్తిగా సమ్మతమేనని, దానిపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం చైనా రాజధాని బీజింగ్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో జరిగిన సమావేశంలో షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రష్యాతో పాకిస్థాన్ కూడా అత్యంత బలమైన సంబంధాలను నిర్మించుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు షెహబాజ్ షరీఫ్ తెలిపారు. "మేము కూడా మీతో చాలా బలమైన సంబంధాలు కోరుకుంటున్నాం. ఈ బంధం ఈ ప్రాంతం యొక్క పురోగతి, శ్రేయస్సుకు పరస్పరం సహాయకరంగా ఉంటుంది" అని ఆయన పుతిన్తో అన్నారు. ఈ సందర్భంగా పుతిన్ను "చాలా డైనమిక్ నాయకుడు" అని ప్రశంసించిన షరీఫ్, ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమి 80వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చైనా నిర్వహిస్తున్న భారీ సైనిక కవాతులో పాల్గొనేందుకు పుతిన్, షరీఫ్ ఇద్దరూ బీజింగ్ వచ్చారు. ఈ సందర్భంగానే తాజా భేటీ జరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com