Russia : ఉక్రెయిన్ జైలుపై రష్యా వైమానిక దాడి.. 17 మంది మృతి

ఉక్రెయిన్లోని జపోరిజ్జియా ప్రాంతంలోని ఒక జైలుపై రష్యా వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో కనీసం 17 మంది ఖైదీలు మరణించారు, 80 మందికి పైగా గాయపడ్డారు. జూలై 29, 2025 (మంగళవారం) ఉదయం వెలువడిన నివేదికల ప్రకారం, సోమవారం రాత్రి (జూలై 28, 2025) రష్యా దళాలు జపోరిజ్జియాలోని బిలెంకే కరెక్షనల్ కాలనీ (Bilenke Correctional Colony) పై నాలుగు గైడెడ్ ఏరియల్ బాంబులు (KABs) ప్రయోగించాయి ఈ దాడిలో జైలులోని భోజనశాల పూర్తిగా ధ్వంసమైంది. అడ్మినిస్ట్రేటివ్ భవనం మరియు క్వారంటైన్ యూనిట్కు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. ఉక్రెయిన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ దాడిలో 17 మంది ఖైదీలు మరణించగా, 42 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 40 మందికి స్వల్ప గాయాలు తగిలాయి. ఆసుపత్రిలో చేరిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. జైలు సిబ్బందిలో ఒకరికి కూడా స్వల్ప గాయాలైనట్లు సమాచారం. రెండు ఇస్కాందర్-M బాలిస్టిక్ క్షిపణులతో పాటు 37 షహేద్ డ్రోన్లు, డికాయ్ యూఏవీలను రష్యా ప్రయోగించిందని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. అయితే, వీటిలో 32 షహేద్ డ్రోన్లను ఉక్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకున్నట్లు పేర్కొంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com