Delhi Police: జమ్ముకశ్మీర్‌లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం

Delhi Police: జమ్ముకశ్మీర్‌లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం
టెర్రరిస్ట్​గా మారిన మాజీ ఆర్మీ జవాన్ అరెస్ట్

జమ్ముకశ్మీర్‌లో (Jammu Kashmir) భారీ ఉగ్ర కుట్రను దిల్లీ పోలీసులు (Delhi Police) భగ్నం చేశారు. దేశాన్ని రక్షించేందుకు పనిచేసిన ఓ ఆర్మీ జవాను పదవీ విరమణ అనంతరం ఉగ్రవాదిగా మారి పెను విధ్వంసానికి ప్రణాళిక రచించాడు. పక్కా సమాచారంతో ఈ ఉగ్రవాదిని దేశ రాజధాని దిల్లీలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ మాజీ ఆర్మీ జవాను.. సరిహద్దుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని దేశంలోకి తెచ్చి ముష్కరులకు అందించడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడని పోలీసులు తెలిపారు.

భారత సైన్యం నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత ఉగ్రవాదిగా మారిన ఒక వ్యక్తిని దేశ రాజధాని దిల్లీలో అరెస్టు చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఓ ఉగ్ర కుట్రను భగ్నం చేసినప్పుడు అందిన సమాచారం మేరకు ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. నిందితుడిని లష్కరే తోయిబాకు చెందిన రియాజ్‌ అహ్మద్‌గా గుర్తించారు. రియాజ్‌ అహ్మద్‌... రిటైర్డ్ ఆర్మీ జవాను అని.. గతేడాది జనవరి 31న సైన్యం నుంచి పదవీ విరమణ చేశాడని దిల్లీ డీసీపీ మల్హోత్రా తెలిపారు. పారిపోయేందుకు ప్రయత్నించిన రియాజ్‌ను న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌లోని ఎగ్జిట్ గేట్ నంబర్ వద్ద అరెస్ట్‌ చేశామని వివరించారు. జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు రియాజ్‌, అతడి సహచరులు ప్రయత్నించారని దిల్లీ పోలీసులు తెలిపారు. ఇందుకోసం వారు పాక్‌లో టెర్రరిస్టు హ్యాండ్లర్‌ నుంచి ఆయుధాలు,మందుగుండు తెప్పించేందుకు కుట్ర పన్నారని... వీటితో దాడులు చేయాలన్నది ఈ బృందం లక్ష్యమని దిల్లీ పోలీసులు ప్రకటించారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్‌ ఫోన్‌, సిమ్‌కార్డ్‌ను స్వాధీనం చేసుకొన్నారు.


జమ్మూకశ్మీర్‌లోని కుప్వాడా జిల్లాలో దాడుల కుట్రను ఇటీవలే భద్రతా దళాలు భగ్నం చేశాయి. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి ఆయుధాల స్మగ్లింగ్‌కు ప్రయత్నిస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో అహ్మద్‌ భట్‌ అనే వ్యక్తి వద్ద 5 ఏకే సిరీస్‌ రైఫిళ్లు, తూటాలు, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకొన్నారు. అతడికి సరిహద్దు అవతలవైపు ఉగ్రమూకతో సంబంధాలున్నాయి. పీవోకేలోని లష్కరే నాయకులు మంజూర్‌ అహ్మద్‌ షేక్‌, ఖాజీ మహమ్మద్‌ ఖుషాల్‌ల ఆదేశాల మేరకు ఈ బృందం పనిచేస్తున్నట్లు తేలింది. రియాజ్‌తోపాటు ఖుర్షీద్‌ అహ్మద్‌, గులాం సర్వార్‌ అనే వ్యక్తులు కూడా పాక్‌లోని ఉగ్రవాదులకు సహకరిస్తున్నట్లు గుర్తించారు. పాకిస్థాన్‌ నుంచి అక్రమంగా వచ్చే ఆయుధాలను... సరిహద్దు దాటించి దేశంలోకి తీసుకు రావడంలో రియాజ్‌ అహ్మద్‌ కీలకంగా వ్యవహరించాడని పోలీసులు తెలిపారు

Tags

Read MoreRead Less
Next Story