ఇవాళ కీలక శాఖపై జగన్ రివ్యూ.. ఆ పథకం పేరు మారుస్తారా?..లేక..
వరుస సమీక్షలు, ప్రక్షాళనతో ముందుకు సాగుతున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి శాఖల వారిగా సమీక్షలు నిర్వహిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న జగన్...ఇవాళ కీలకమైన వ్యవసాయ శాఖపై రివ్యూ చేయనున్నారు. క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ స్థితి గతులపై అధికారులతో సమీక్షిస్తారు.
ఎన్నికల ప్రచారం సందర్భంగా రైతులకు పలు హామీలిచ్చారు జగన్. ముఖ్యంగా పంటల గిట్టుబాటు ధర, 3 వేల కోట్లతో ధరల స్థీరికరణ నిధి ఏర్పాటు, రైతులకు ఉచిత బోర్లు, 12 వేల 500 నాలుగు దశల్లో రైతుకు పెట్టుబడి సాయంతో పాటు పలు హామీలను తన మేనిఫెస్టోలో పొందుపరిచారు. వీటి అమలు, విధి విధానాలపై అధికారులతో జగన్ చర్చించనున్నారు. వ్యవసాయ శాఖపై ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
గత ప్రభుత్వం ఎన్నికల ముందు అన్నదాత సుఖీభవ పేరుతో రైతుకు పెట్టుబడి సాయం పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఏటా ప్రతి రైతుకు కేంద్రం ఇచ్చే ఆరు వేలతో పాటు 9 వేల ఆర్థిక సాయం అందించింది. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావడంతో... ఆ పథకాన్ని కొనసాగిస్తూనే పెట్టుబడి సాయాన్ని మరింత పెంచనుంది. అయితే గత ప్రభుత్వం తీసుకొచ్చిన అన్నదాత సుఖీభవ అనే పథకం పేరును మారుస్తారా? లేక ఆ పేరుతోనే పెట్టుబడి సాయాన్ని ప్రస్తుత ప్రభుత్వం అందిస్తుందా అన్నది చర్చనీయాంశమైంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com