కరోనా ఎఫెక్ట్.. ఏపీలో విద్యాసంస్థలు బంద్

ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తడంతో కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు చర్యలు చేపట్టింది. గురువారం నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలతో పాటు కోచింగ్ సెంటర్లను సహా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి నిర్ణయం తీసుకునే వరకు విద్యాలయాలు తెరవకూడదని స్పష్టంచేసింది. వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే షట్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 150కి చేరింది. వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో విద్య, వైద్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించారు. అనంతరం.. అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెలాఖరులో పరిస్థితిని సమీక్షించి సెలవుల పొడిగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com