విశాఖలో విజృంభిస్తున్న కరోనా
ఏపీలో కరోనా ప్రభావం తగ్గటం లేదు. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 54 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1887కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో కర్నూలులో ఇద్దరు, విశాఖలో ఒకరు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 41కి పెరిగింది. ప్రభుత్వం విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో మొత్తం 7,320 శాంపిల్స్ పరీక్షించినట్లు వెల్లడించింది. మరోవైపు రాష్ట్రంలో 824 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. గత 24 గంటల్లో 62 మంది డిశ్చార్జ్ ఆయ్యారు. ప్రస్తుతం 1004 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
గడిచిన 24 గంటల్లో అత్యధికంగా అనంతపురంలో 16 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. అటు విశాఖ జిల్లాలో వైరస్ మళ్లీ ఉద్ధృతమవుతోంది. జిల్లాలో కొత్తగా 11 మందికి కరోనా సోకింది. దీంతో జిల్లాలో కరోనా పేషెంట్ల సంఖ్య 57 మందికి పెరిగింది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలులో 7, కృష్ణా జిల్లాలో 6, చిత్తూరులో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. అలాగే గుంటూరు, విజయనగరం జిల్లాల్లో ఒక్కో పాజిటివ్ కేసు నమోదైంది. గడిచిన 24 గంటల్లో కడప, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
అనంతపురం జిల్లాలో కరోనా తీవ్రత మరింత పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇవాళ విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం జిల్లాలో 16 మందికి వైరస్ సోకింది. బాధితులు అంతా హిందూపురానికి చెందిన వారే కావటంతో పట్టణంలో జనం భయపడిపోతున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 99కి చేరుకుంది. దీంతో లాక్డౌన్ మరింత కఠినంగా అమలు చేయాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కర్నూలు జిల్లాలో పాజిటివ్ కేసులు తగ్గినా..వైరస్ తీవ్రత మాత్రం వ్యాప్తికి అడ్డుకట్ట పడడం లేదు. ఇవాళ కూడా 7 కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసులు 547 అయితే.. యాక్టివ్ కేసులు 342 ఉన్నాయి. దీంతో లాక్డౌన్ కఠినంగా అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నా..మద్యం షాపులు తెరవడం కొన్ని చోట్ల సమస్యగా మారింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com