Sri Sathya Sai District: 16 ఏళ్ల బాలికతో 60 ఏళ్ల వైసీపీ నేత పెళ్లి..
Sri Sathya Sai District: 60 ఏళ్ల ముసలి వ్యక్తి 16 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్నాడు. పైగా ఆ వృద్ధ ప్రబుద్ధుడు సాక్షాత్తు వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కూడా. మంచి చెడు చెప్పాల్సిన వయసులో.. సమాజం తలదించుకునే పనిచేశాడు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఈ దారుణం జరిగింది. బుక్కపట్నం మండలం కృష్ణాపురం వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడి హోదాలో ఉన్న జయకృష్ణ.. 62 ఏళ్ల వయసులో 16 ఏళ్ల బాలికను పెళ్లాడిన విషయం మూడు నెలలు ఆలస్యంగా బయటికొచ్చింది.
బుక్కపట్నం మండలం కృష్ణాపురానికి చెందిన వైసీపీ నేత జయకృష్ణ.. కొన్నేళ్ల క్రితం యల్లనూరు మండలం పాతపాల్యం వచ్చి స్థిరపడ్డాడు. ఇక్కడ జయకృష్ణ.. తనకు తానుగా జడలస్వామిగా పరిచయం చేసుకుని, చెలామణి అవుతున్నాడు. ఓ పదహారేళ్ల బాలిక.. తన తల్లి అనారోగ్యానికి వైద్యం కోసం వివిధ ఆస్పత్రుల్లో తిరిగింది. జబ్బు నయంకాకపోవడంతో చివరికి బుక్కపట్నం మండలం కృష్ణాపురానికి చెందిన జయకృష్ణ వద్దకు వచ్చింది.
జడలస్వామిగా చెలామణి అవుతున్న వైసీపీ నేత జయకృష్ణ.. క్షుద్రపూజలు కూడా చేస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. దెయ్యం పట్టిందని బాలిక తల్లికి క్షుద్ర పూజలు చేసి.. తన వల్లే నయమైందని వారిని నమ్మించాడు. అదే సమయంలో 16ఏళ్ల బాలికపై కన్నేశాడు. కూలీ పని చేసుకుని జీవించే ఆ కుటుంబానికి తనదైన శైలిలో మాయమాటలు చెప్పాడు. అలా నమ్మించి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న తన కూతురిని వివాహం చేసుకున్నాడని బాధితురాలి తల్లిదండ్రులు చెబుతున్నారు.
మూడు నెలల క్రితం రాప్తాడు మండలంలో వైసీపీ నాయకుడు ఓ బాలికను రహస్యంగా వివాహం చేసుకున్నాడు. బాలిక సమీప బంధువు ఐసీడీఎస్ అధికారికి ఫిర్యాదు చేయడంతో ఏం జరిగిందనే దానిపై విచారణ చేపట్టారు. కృష్ణాపురం వెళ్లి ఆరా తీశారు. విషయం తెలుసుకున్న వైసీపీ నేత జయకృష్ణ అలియాస్ జడల స్వామి పరారయ్యాడు. బాలికను అధికారులు ఉజ్వల హోంకు తరలించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com