CBN: జగన్‌.. దమ్ముంటే పులివెందులలో గెలువు

CBN: జగన్‌.. దమ్ముంటే పులివెందులలో గెలువు
చంద్రబాబు సవాల్‌... జగన్‌ ఇప్పటికే ఓటమి అంగీకరించారని వ్యాఖ్య....

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పాలనలో జగన్‌ బాదుడుకు బలైన ప్రజల గోడు వినిపిస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఉద్యోగం లేని యువత బాధ, సాగునీరందక రైతు పడుతున్న వ్యథ కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మి ఓట్లేసిన ప్రజల నెత్తిపైనే జగన్‌ చేతులు పెట్టారన్న చంద్రబాబు....జనం సైతం జగన్‌ని ఎప్పుడు దించేద్దామా అని ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఇది తెలిసే ఎన్నికలకు ముందే జగన్‌ పారిపోయారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సన్నాహకంలో భాగంగా నెల్లూరు, కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించి రా కదలి రా బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొన్నారు. జగన్‌ వల్ల సమాజంలో ప్రతిఒక్కరూ బాధితులుగా మారారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలననను అంతమొందించేందుకు అన్ని ఊళ్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సీఎంను ఇంటికి పంపడానికి అన్నదాతలు, నిరుగ్యోగులు, బడుగు బలహీన వర్గాలు ఎదురుచూస్తున్నాయని చెప్పారు.


వైసీపీ పాలనలో బీసీలపై దాడులు పెరిగాయని చంద్రబాబు విమర్శించారు. బీసీని చంపిన కేసులో నిందితులు రోడ్లమీద తిరుగుతున్నారన్నారు. కోడికత్తి కేసులో శ్రీను ఐదేళ్లుగా జైల్లో మగ్గిపోతుంటే వివేకా హత్యకేసులో నిందితులు మాత్రం బయట తిరుగుతున్నారన్నారు. జగన్‌కు స‌బ్జెక్ట్‌ వీక్‌....బిల్డప్‌ పీక్‌ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఇండియా టుడే ఇంటర్వ్యూలో ప్రశ్నపత్రంలో లేని ప్రశ్న అడిగే సరికి జగన్‌ సమాధానం చెప్పలేకపోయారన్నారు. వైనాట్‌ 175 అన్న ముఖ్యమంత్రి దమ్ముంటే పులివెందులలో గెలిచి చూపించాలని చంద్రబాబు సవాల్‌ విసిరారు. ఎన్నికలకు ముందే యుద్ధ రంగం నుంచి వైసీపీ పారిపోయిందన్నారు.


ముఖ్యమంత్రి బీసీల ద్రోహి. ఆయన ఏ బీసీకైనా న్యాయం చేశారా? ఆదరణ, మరో 30 పథకాలను రద్దుచేశారని చంద్రబాబు తెలిపారు. ఏపీతో పాటు హైదరాబాద్‌, కర్ణాటకలకు వలసపోయినవారిలో కర్నూలు నుంచి వెళ్లినవారే ఎక్కువని టీడీపీ అధినేత వెల్లడించారు. ఏమిటీ ఖర్మ అని టీడీపీ అధికారంలోకి రాగానే సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తామని తెలిపారు. ఉపాధి కల్పిస్తామని.... వలసలు ఆపే బాధ్యతను తీసుకుంటామని వెల్లడించారు. వెనకబడిన వర్గాలకు చెందిన కేఈ కృష్ణమూర్తిని డిప్యూటీ సీఎం చేసిన పార్టీ టీడీపీ అని... ఆయన, యనమల రామకృష్ణుడు తదితర అనేకమంది బీసీ నాయకులను, ఎమ్మెల్యేలను ఆంధ్రప్రదేశ్‌కు అందించిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు తెలిపారు. ప్రస్తుత పాలనలో బీసీలపై దాడులు పెరిగిపోయాయని... తన చెల్లెల్ని వేధించాడని ప్రశ్నించినందుకు అమరనాథ్‌గౌడ్‌ను తగలబెట్టి చంపేశారని టీడీపీ అధినేత వెల్లడించారు. బీసీని చంపిన నేరస్థులు రోడ్డుమీద తిరుగుతున్నారని... కోడికత్తి కేసులో శ్రీను ఐదేళ్లుగా జైల్లో మగ్గిపోతుంటే... వివేకా హత్యకేసులో నిందితులు మాత్రం బయట తిరుగుతున్నారని తెలిపారు. దీన్నిబట్టి ముఖ్యమంత్రి ఎలాంటి వ్యక్తో అర్థం చేసుకోవచ్చని ప్రజలకు సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story