AP Elections 2024: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఎన్నికల విధులు

AP Elections 2024: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఎన్నికల విధులు
వేలికి ఇంకు పూసేందుకు మాత్రమే

ఎన్నికల విధుల్లో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను వినియోగించొద్దంటూ ఎన్ని ఫిర్యాదులందినా, పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా... కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం వాటన్నింటినీ బేఖాతరు చేసింది. ఎన్నికల విధుల్లో.. సచివాలయ సిబ్బంది నియామకానికి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది.

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధుల్లోకి తీసుకునే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను అదర్‌ పోలింగ్‌ ఆఫీసర్స్‌గా నియమించుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ విషయంలో తమకెలాంటి అభ్యంతరమూ లేదని తేల్చిచెప్పింది. అయితే పోలింగ్‌ పార్టీల్లో వారిని నియమించేందుకు కొన్ని షరతులు విధించింది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఈ ఆదేశాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపించారు. తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు అదర్‌ పోలింగ్‌ ఆఫీసర్స్‌గా మాత్రమే విధులు అప్పగించాలని కేంద్ర ఎన్నికల సంఘం తన ఆదేశాల్లో పేర్కొంది. ఓటరు చేతివేలికి ఇంకు వేయటం తదితర బాధ్యతలే వారికివ్వాలని స్పష్టం చేసింది. ప్రతి పోలింగ్‌ పార్టీలోనూ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు గరిష్ఠంగా ఒక్కరే ఉండాలని పేర్కొంది. బూత్‌ స్థాయి అధికారులుగా విధులు నిర్వహిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్‌ పార్టీల్లో నియమించొద్దని తేల్చి చెప్పింది. పోలింగ్‌ రోజున వారికి నిబంధనల ప్రకారం ఇతరత్రా విధులుంటాయని ఆదేశాల్లో స్పష్టం చేసింది.


గ్రామ, వార్డు వాలంటీర్లను ఏ రూపంలోనూ ఎన్నికల విధుల్లో వినియోగించొద్దని కేంద్ర ఎన్నికల సంఘం పునరుద్ఘాటించింది. పోటీలో ఉన్న అభ్యర్థులకు పోలింగ్‌ ఏజెంట్లుగా కూడా వారిని అనుమతించొద్దని మరోమారు స్పష్టం చేసింది. 2021 ఏప్రిల్‌ 13న ఈ మేరకు ఇచ్చిన ఆదేశాలను మరోసారి గుర్తు చేసింది. సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులు అప్పగిస్తే ఎన్నికల నిర్వహణ నిష్పక్షపాతంగా సాగదని ప్రధాన ప్రతిపక్షం గత నెల 9న విజయవాడకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌కు ఫిర్యాదు చేసింది. అయినా వారికి అదర్‌ పోలింగ్‌ ఆఫీసర్స్‌గా విధులు అప్పగించవచ్చని ఎన్నికల సంఘం పేర్కొంది.

సాధారణంగా అదర్‌ పోలింగ్‌ ఆఫీసర్‌గా వ్యవహరించే వారిని సెకండ్‌ పోలింగ్‌ ఆఫీసర్, థర్డ్‌ పోలింగ్‌ ఆఫీసర్, ఫోర్త్‌ పోలింగ్‌ ఆఫీసర్, ఫిఫ్త్‌ పోలింగ్‌ ఆఫీసర్‌ అంటారు. సెకండ్‌ పోలింగ్‌ ఆఫీసర్‌గా వ్యవహరించేవారు.. ఓటరు ఎడమచేతి చూపుడు వేలికి ఇంకు పూయటం, ఓటర్ల రిజిస్టర్‌ 17-A లో ఓటరు వరుస సంఖ్య, గుర్తింపు కార్డు పేరు రాయటం, రిజిస్టర్‌లో ఓటరు సంతకం, వేలిముద్ర తీసుకోవటం చేస్తారు. థర్డ్‌ పోలింగ్‌ ఆఫీసర్‌గా వ్యవహరించేవారు ఓటర్లు స్లిప్పులకు ఇన్‌ఛార్జిగా ఉంటారు. అయితే ఎన్నికల సంఘం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను అదర్‌ పోలింగ్‌ ఆఫీసర్‌గా నియమించుకోవచ్చని, ఓటరు చేతివేలికి ఇంకు వేయటం తదితర బాధ్యతలే వారికివ్వాలని చెప్పింది. ఎన్నికల విధుల్లో భాగంగానే ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story