బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజులు వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా చలిగాలులు వీస్తున్నాయి. దేశంలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ అండమాన్ సమీపంలోని మలక్కా జలసంధి ప్రాంతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బుధవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అనంతరం వాయువ్య దిశగా కదిలి 48 గంటల్లో తుఫానుగా బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో దిగువ ట్రోపో ఆవరణలో గాలులు వీస్తున్నాయి.
వీటి ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మంగళవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com