AP: వైసీపీలో చేరాలంటూ ఎస్సై వేధింపులు..మత్య్సకారుడి ఆత్మహత్య

AP: వైసీపీలో చేరాలంటూ ఎస్సై వేధింపులు..మత్య్సకారుడి ఆత్మహత్య
వైసీపీ కార్యకర్తలా మారిపోయిన ఎస్సై.... బలవన్మరణానికి పాల్పడ్డ నిరుపేద మత్య్సకారుడు

వైసీపీలో చేరతారా... లేకుంటే చస్తారా అంటూ ఓ ఎస్సై చేసిన వేధింపులు ఓ మత్స్యకారుడి ఆయువును బలి తీసుకుంది. వైసీపీ కార్యకర్తలా మారిన ఆ ఎస్సై.. టీడీపీ సానుభూతిపరులపై అక్రమ కేసులు బనాయించి వేధించాడు. ఆ ఎస్సై దాష్టీకానికి ఓ నిరుపేద మత్స్యకారుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ దారుణం ఆంధ్రప్రదేశ్‌లోని మరో చంబల్‌ లోయగా, అరాచకానికి అడ్డాగా మారిన పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో జరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం బంగారుపెంట తండాకు చెందిన మత్స్యకారులకు కష్టాలు ఎదురయ్యాయి. దశాబ్దాల కిందట వీరంతా విశాఖ నుంచి వలసొచ్చారు. నదిలో చేపల వేట సాగిస్తూ, జీవనం సాగించే వీరికి ఆ పార్టీ నాయకులు కొందరు తెలంగాణ మద్యాన్ని ఏపీలోకి తీసుకొస్తూ వీరి బోట్లు ఎక్కుతున్నారు. నిరాకరిస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు.


పోలీసులు, సెబ్‌ అధికారులు దాడులు చేసినప్పుడు మద్యం అక్రమ రవాణా చేస్తున్న అధికార పార్టీకి చెందిన వారిని తప్పించి..బోట్లు నడుపుతున్న మత్స్యకారులపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. ఇదే తరహాలో వెల్దుర్తి పోలీసులు మత్స్యకారుడు దుర్గారావుపై నెల క్రితం కేసు నమోదు చేశారు. ఆయన హైకోర్టును ఆశ్రయించి బెయిల్‌ తెచ్చుకున్నారు. అయినా సరే ఎస్సై శ్రీహరి నుంచి వేధింపులు ఆగలేదు. దుర్గారావును పదేపదే స్టేషన్‌కు పిలిపించి, టీడీపీను వీడి వైసీపీలో చేరాలని ఒత్తిడి చేసేవారని....లేదంటే తనకు 2 లక్షలు ఇవ్వాలని ఫోన్‌చేసి వేధిస్తుండేవాడని బాధితుడి కుటుంబీకులు వాపోయారు. వైసీపీలో చేరలేదన్న కోపంతో వేధించేవారని ఆ బాధలు భరించలేకే దుర్గారావు ఆత్మహత్య చేసుకున్నారని కన్నీటి పర్యంతమయ్యారు.


హైకోర్టు నుంచి బెయిల్‌ పొందిన దుర్గారావు ఆదివారం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి సంతకం చేయాల్సి ఉందని మత్స్యకారులు తెలిపారు. అక్కడికి వెళితే ఎస్సై శ్రీహరి చిత్రహింసలకు గురిచేస్తారన్న భయంతో చేపల వేటకు వెళ్లాడని చెప్పారు. బోటులో నది మధ్యలోకి వెళ్లి...వల తీగలను మెడకు చుట్టుకొని, ఉరేసుకుని నదిలోకి దూకాడని చెప్పారు. దుర్గారావును రక్షించే ప్రయత్నం చేసినా...అప్పటికే ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్గారావు మృతదేహంతో వెల్దుర్తి పోలీస్‌ స్టేషన్‌ వద్దకు వెళ్లిన మత్స్యకారులు స్టేషన్‌ వద్ద జాతీయ రహదారిపై మృతదేహాన్ని ఉంచి ధర్నా చేశారు. ఎస్సై వేధింపుల వల్లే దుర్గారావు చనిపోయారని..న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలుగుదేశం మాచర్ల ఇన్‌ఛార్జ్‌ బ్రహ్మారెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఘటనా స్థలికి చేరుకున్న గురజాల డీఎస్పీ పల్లపురాజు సముదాయించడంతో మత్స్యకారులు మృతదేహాన్ని తీసుకెళ్లారు.

Tags

Read MoreRead Less
Next Story