Online Money : ఆన్ లైన్ లో పోయిన డబ్బుకోసం యువతి డ్రామా
పోయిన డబ్బుకోసం లబోదిబోమని బాధపడే వాళ్లను చూసుంటారు. డబ్బు పోతే పోయిందని ఫ్యూచర్ పై ఆశలు పెట్టుకున్నవాళ్ల గురించి విని ఉంటాం. ఇది మూడోరకం. కొత్త డ్రామా. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లోకి దొంగలు చొరబడి అందిన కాడికి దోచుకు పోయారంటూ వచ్చిన ఫిర్యాదు వెనుక పెద్ద డ్రామా ఉందని పోలీసులు తేల్చారు.
"వాష్ రూమ్లోకి వెళ్ళిన సమయంలో ముఖానికి మాస్క్ ధరించి కొందరు దుండగులు ఇంట్లోకి దర్జాగా ప్రవేశించి ఇంట్లో ఉన్న వస్తువులను చిందరవందరగా పడేసి అల్మారాలో ఉన్న బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించారు. వాష్ రూమ్లోకి వెళ్లి వచ్చేసరికి దుండగులు ఇంటి నుండి బయటకు పరుగులు తీశారు, వారిని పట్టుకునేందుకు ప్రయత్నం చేశాను. దుండగులు గోడకు నెట్టేసి అక్కడి నుండి పారిపోయారు" అని ఓ యువతి పోలీసులకు వెల్లడించింది.
తమదైన స్టైల్ లో పోలీసులు విచారణ చేయడంతో అసలు నిజం యువతి బయటికి కక్కింది. యువతి ఆన్లైన్ గేమ్ లకు అలవాటు పడి 25 వేల రూపాయలను పోగొట్టుకుంది. ఆ విషయం ఇంట్లో తెలిస్తే తల్లిదండ్రులు కోప్పడతారని పక్కా స్కెచ్ వేసింది. పథకం ప్రకారం ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవడంతో అదే అదనుగా భావించిన సదరు యువతి ఇంట్లోకి దొంగలు చొరబడి నగదు, బంగారం కొట్టేసారని పైగా మంకీ క్యాప్ లు ధరించి మరీ చోరీకి వచ్చారని ఒక చక్కటి కథ అల్లి స్థానికులను, మీడియాను నమ్మించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ యువతికి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులను హెచ్చరించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com