BJP : వివాదంలో బీజేపీ అభ్యర్థి మాధవీ లత!
బీజేపీ హైదరాబాద్ లోక్సభ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత వివాదంలో చిక్కుకున్నారు. శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా ఆమె వ్యవహరించిన తీరు చర్చనీయాంశం అవుతోంది. గురువారం హైదరాబాద్ పాతబస్తీ సిద్ది అంబర్ బజార్ మీదుగా యాత్ర సాగుతున్న సమయంలో మాధవీలత.. విల్లు ఎక్కుపెట్టి బాణం వదులుతున్నట్లుగా అభినయించారు.
అయితే, బాణం వదిలిన దిశగానే మసీదు ఉన్నట్లుగా వీడియోలు సోషల్ మీడియా ద్వారా బయటకు రావడం విమర్శలకు దారితీసింది. ఈ వీడియో వైరల్ కావడంతో ఆమె తీరు విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందంటూ కొందరు తప్పుబట్టారు. మాధవీలత కెమెరాకు పోజి చ్చే క్రమంలోనే ఇలా చేశారంటూ ఇంకొందరు సమర్థించారు. దీనిపై హైదరాబాద్ ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ప్రజలు అంతా చూస్తున్నారని.. రెచ్చగొట్టే చర్యలను తిప్పికొడతారని వ్యాఖ్యానించారు.
ఎన్నికల కంటే హైదరాబాద్లో శాంతిభద్రతలు ముఖ్యమని.. విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్న బీజేపీ నేతలను ఎందుకు ఉపేక్షిస్తున్నారని ఎన్నికల సంఘం, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను ప్రశ్నించారు. కాగా, తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. సోషల్ మీడియాలో ఉన్నది అసంపూర్ణ వీడియో అని మాధవీలత తెలిపారు. ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించాలని కోరారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com