TS : కడియం, కేకే అదను చూసి దెబ్బ కొట్టారా..?

TS : కడియం, కేకే అదను చూసి దెబ్బ కొట్టారా..?

అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్‌కు (BRS) వరుసగా షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు పార్టీలోకి వచ్చిన వలస నేతలు. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్‌ నాయకులు బీఆర్ఎస్‌ను వీడగా.. తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా అవకాశం దక్కిన కడియం కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆమె బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు లేఖ కూడా రాశారు. గురువారం బీఆర్ఎస్‌కు వరుసగా ఎదురుదెబ్బలే తగిలాయి.

బీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి బీఆర్ఎస్‌ను వీడుతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే తాము కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు చెప్పారు. ఇంతలోనే కడియం కావ్య గురువారం రాత్రి బ్రేకింగ్ న్యూస్ అయ్యారు. గతకొద్ది రోజులుగా పార్టీ నాయకత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలు, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్‌ స్కాం వంటి అంశాలు బీఆర్ఎస్‌ ప్రతిష్టను దిగజార్చాయి అని లేఖలో కావ్య రాశారు. జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం లేకుండా పోయిందనీ.. సహకారం లేదనీ.. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తుండటం పార్టీకి మరింత నష్టం చేసిందని కావ్య లేఖలో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తాను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయం తీసుకున్టన్లు చెప్పారు.

వరంగల్ ను పెండింగ్ లో పెట్టింది కూడా ఇందుకేనని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. వరంగల్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కావ్య లేదా కడియం శ్రీహరిని నిలిపే చాన్సెస్ ఉన్నాయి. ఒక వేళ కావ్యను అభ్యర్థిగా నిర్ణయిస్తే.. శ్రీహరిని కాంగ్రెస్‌లో చేర్చుకుని.. రాష్ట్ర కేబినెట్‌లో చోటు కల్పించే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. కేసీఆర్‌తో సమావేశం తర్వాత కె.కేశవరావు బీఆర్ఎస్‌ను వీడుతున్నట్లు ప్రకటన చేశారు. తిరిగి తన పూర్వ పార్టీలో చేరాలనుకుంటున్నట్లు స్వయంగా తెలిపారు. 53 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో పనిచేశానని చెప్పారు. ఇప్పుడు తాను రాజకీయ విరమణ దశలో ఉన్నానని చెప్పారు. తీర్థయాత్రలకు వెళ్లిన వారు తిరిగి ఇంటికే చేరుతారనీ.. అలాగే తాను కూడా సొంత ఇల్లు లాంటి కాంగ్రెస్‌లో చేరాలని అనుకుంటున్నట్లు తెలిపారు. కేకేతో పాటు GHMC మేయర్‌ గద్వాల విజయలక్ష్మి కూడా ఈ నెల 30న కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వెల్లడించారు. అధికార పార్టీలో ఉంటేనే పనులు అవుతాయనీ.. సమస్యలు పరిష్కరించగలమని గద్వాల విజయలక్ష్మి చెప్పడం విశేషం.

Tags

Read MoreRead Less
Next Story