TS : నేడు సంగారెడ్డికి మోడీ.. షెడ్యూల్ ఇదే
రెండు రోజుల తెలంగాణ (Telangana) పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ (PM Modi) మంగళవారం సంగారెడ్డిలో పర్యటించనున్నారు. సంగారెడ్డి వేదికగా రూ.9021 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం సంగారెడ్డి పటేల్ గూడలో బీజేపీ నిర్వహించే విజయ సంకల్ప బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్నారు. పటాన్ చెరులో ప్రధాని పాల్గొనే బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి.
పటేల్గూడలోని ఎస్ఆర్ ఇన్ఫినిటీలో బహిరంగసభ జరగనుంది. సోమవారం ఆదిలాబాద్ పర్యటన ముగించుకున్న అనంతరం చెన్నైకి వెళ్లిన ప్రధాని... తిరిగి సోమవారం రాత్రి దాదాపు 7.50 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. బేగంపేట్ నుంచి రోడ్డు మార్గంలో రాజభవన్ కు వెళ్లారు. రాజభవన్ కు విచ్చేసిన మోదీకి గవర్నర్ తమిళిసై సాదర స్వాగతం పలికారు. సోమవారం రాత్రి రాజ్ భవన్ లో బస చేశారు.
ప్రధాని మోదీ మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ లోని మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం అక్కడి నుంచి సంగారెడ్డి పర్యటనకు వెళతారు. ఉదయం 10 గంటలకు పటాన్ట్చెరుకు ప్రధాని చేరుకుంటారు. 10.40 నిమిషాలకు పటేల్గూడలో పలు అభివృద్ధికార్యక్రమాలను వర్చువల్ ప్రారంభిస్తారు. అనంతరం 11.20 నిమిషాలకు పటేల్ గూడలో బీజేపీ నిర్వహించే విజయ సంకల్ప బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. బహిరంగ సభ తర్వాత తెలంగాణ పర్యటనను ముగించు కుని ప్రధాని ఒడిశాకు వెళ్లనున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com