Recruitment : సింగరేణిలో 485 పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వండి : భట్టి విక్రమార్క

Recruitment : సింగరేణిలో 485 పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వండి  : భట్టి విక్రమార్క

సింగరేణి కాలరీస్ లో ఖాళీగా ఉన్న 317. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులను, 168 ఇంటర్నల్ రిక్రూట్మెంట్ పోస్టులను తక్షణమే భర్తీ చేసేందుకు వీలుగా నోటిఫికేషన్లు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. సింగరేణి చైర్మన్, ఎండీ బలరామ్ నాయక్ ను ఆదేశించారు. సింగరేణిలో కారుణ్య నియామకాల ప్రక్రియను వేగవంతం చేయాలని, ఈ ఏడాదిలో కనీసం వెయ్యి మంది వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు.

సింగరేణి కాలరీస్ అధ్వర్యంలో చేపట్టాల్సిన ఆభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై బుధవారం సచివాలయంలో సింగరేణి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. బలరామ్, డైరెక్టర్ (పర్సనల్) ఎన్.వి.కె.శ్రీనివాస్, ఇతర అధికారులతో డిప్యూటి సీఎం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటి సీఎం మాట్లాడుతూ ఉద్యోగాల నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలన్నారు. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదన్నారు. నోటిఫికేషన్ల ప్రక్రియ పకడ్బందీగా ఉండాలని సూచించారు.

సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి ఉద్యోగ మేళాలో ఇచ్చిన హామీ మేరకు వారసుల వయో పరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచే విషయంలో వీలైనంత త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. సింగరేణి కార్మికుల కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఎలాంటి ప్రీమియం చెల్లించనవసరం లేకుండా చేసుకున్న రూ. కోటి ప్రమాద బీమా అవగాహన ఒప్పందం పురోగతి గురించి ఆరా తీశారు. ప్రమాదభరితమైన బొగ్గు రంగంలో పని చేస్తున్న 43 వేల మంది ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా అందించడం ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక భద్రతను కల్పించిన వారమవుతామని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story