Tragic Incident : నిమిషం నిబంధన.. విద్యార్థి ఆత్మహత్య
ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనతో పరీక్ష రాయలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో చోటుచేసుకుంది. జైనథ్ మండలంలోని మాంగూర్ల గ్రామానికి చెందిన టేకం శివకుమార్ గురువారం సాత్నాల ప్రాజెక్ట్ డ్యామ్ లో దూకి సూసైడ్ చేసుకున్నాడు. పరీక్ష రాయలేకపోయాననే మనోవేదనతో చనిపోతు న్నట్లు తన తండ్రికి సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తోంది. నిమిషం నిబందన కారణంగా పరీక్ష రాయలేకపోయాను.. ఈ బాధ భరించలేకపోతున్నాను.. నన్ను క్షమించండి నాన్న అంటూ సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.
మొదటి రోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పరీక్ష రాసేందుకు వెళ్లిన శివ.. పరీక్ష కేంద్రమైన ఆదిలాబాద్ లోని టీఎస్ఎస్ డబ్లూఆర్ జూనియర్ కళాశాలకు రెండు నిమిషాలు ఆలస్యంగా వెళ్లాడు. నిమిషం నిబందన అమల్లో ఉండటంతో సిబ్బంది శివను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. దీంతో పరీక్ష రాయలేకపోయానని మానసికంగా వేదనకు గురైన శివ.. సమీపంలోని సాత్నాల ప్రాజెక్ట్ లోకి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది.
స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కన్న కొడుకు ఇక లేడని వార్తను అతని తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల బుధవారం ప్రారంభమయ్యాయి ఫస్ట్ ఈయర్ పరీక్షను నిమిషం నిబంధన వలన కొంత మంది విద్యార్థులు రాయలేకపోయారు. దీంతో చేసేది లేక విద్యార్థులు వెనుదిరిగారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com