టీడీపీ నేతలు మీకు ఊడిగం చేయాలా?: చంద్రబాబు

టీడీపీ నేతలు మీకు ఊడిగం చేయాలా?: చంద్రబాబు

తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో జగన్ లాంటి ఉన్మాద ముఖ్యమంత్రిని చూడలేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. శాసనసభ, మండలిలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మండలిలో కరెంట్ కట్ చేసి, లైవ్ ప్రసారాలను నిలిపివేసే అధికారం ఈ ముఖ్యమంత్రికి ఎవరిచ్చారని నిలదీశారు. ఈ ప్రభుత్వానికి మండలి ఛైర్మన్ అంటే కనీస గౌరవం లేదన్నారు. ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛ అంటే లెక్కేలేదని ఆరోపించారు. ఏబీఎన్‌, టీవీ5, ఈటీవీ ప్రసారాలను ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోందని ఫైర్ అయ్యారు చంద్రబాబు.

మండలిలో మంత్రులు వ్యవహరించిన తీరుపైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు చంద్రబాబు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించారు. మంత్రులు గుండాలు, బజారు రౌడీల మాదిరిగా ప్రవర్తిస్తుంటే సరెండర్ అవ్వాలా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అంటూ ఫైర్ అయ్యారు. మంత్రులు గూండాల్లా సెల్‌ఫోన్లు లాక్కున్నారని, పేపర్ చింపుతూ, బాటిల్స్ విసిరేశారని అన్నారు. నోటితో చెప్పలేని బూతులు తిట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.

శాసన మండలిని రద్దు చేసే అధికారం సీఎం జగన్‌కు లేదన్నారు చంద్రబాబు. తీర్మానం చేస్తే కేంద్రం కూడా అంగీకరించదని, సెలెక్ట్‌ కమిటీ నిర్ణయం చెప్పే వరకు మండలిని రద్దు చేయడం కుదరదని అన్నారు. కౌన్సిల్‌లో బిల్లు పాస్‌ కాకపోవడం జగన్‌కు అవమానమా అని ప్రశ్నించారు? అని టీడీపీ నేతలు మీకు ఊడిగం చేయాలా అని నిలదీశారు. టీడీపీ ఎమ్మెల్సీల చొరవ చరిత్రలో నిలిచిపోతుందని, ఎమ్మెల్సీలను ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని స్పష్టం చేశారు చంద్రబాబు.

ప్రపంచంలో ఎక్కడా 3 రాజధానులు లేవని అన్నారు చంద్రబాబు. జగన్‌ ఒక్కడికే బుర్ర ఉన్నట్లు మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. 151 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో 86 మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని, ఇలాంటి కరుడుగట్టిన క్రిమినల్స్‌ని పెట్టుకుని.. ఆర్థిక ఉగ్రవాది జగన్‌ రాష్ట్రాన్ని అపహాస్యం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. ఎక్కడి నుంచైనా పరిపాలన చేయొచ్చని జగన్ చెబుతున్నాడని.. కావాలంటే ఆయన ఇడుపులపాయలోనే ఉండాలని చెప్పారు చంద్రబాబు.

Tags

Read MoreRead Less
Next Story