ప్రధాని మోదీకి.. చంద్రబాబు లేఖ.. అభినందనలు
ప్రధాని మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కరోనా నివారణలో భాగంగా కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడాన్ని స్వాగతించారు. ప్రధానికి అభినందనలు తెలిపారు. జనతా కర్ఫ్యూ పెట్టడం, 21రోజులు లాక్ డౌన్ ప్రకటించడం, ఇప్పుడీ ప్యాకేజీ సరైన దిశలో సరైన మార్గదర్శకాలని కొనియాడారు. ఇదే తరహాలో సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమల రంగాన్ని ఆదుకునే చర్యలను చేపట్టాలని కోరారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించే MSME రంగం కరోనా వల్ల దెబ్బతినకుండా చూడాలన్నారు. ధనిక పేద తేడా లేకుండా కరోనా మహమ్మారి అన్నివర్గాల ప్రజలపై ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపిందని, ఈ పరిస్థితుల్లో లక్షా 75వేల కోట్ల ప్యాకేజిని స్వాగతిస్తున్నామని అన్నారు. రాబోయే ఖరీఫ్ లో ఇవ్వాల్సిన నగదు కూడా రైతులకు ముందే ఇవ్వడం అభినందనీయం అన్నారు చంద్రబాబు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద రైతులకు 16వేల కోట్లు పంపిణీకి ముందుకు రావడం శుభపరిణామం అన్నారు. పేద మహిళలకు నెలకు 500 ఎక్స్గ్రేషియా, 3 నెలలు ఉచితంగా వంటగ్యాస్ సిలిండర్లు అందించటం ప్రశంసనీయమన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com